శాఖలవారీగా బడ్జెట్ కేటాయింపులపై చర్చ
అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు
జీహెచ్ఎంసీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కూడా…
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరగనుంది. ప్రధాన ఎజెండాగా 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఉంది. శాఖలవారీగా కేటాయింపులు, భవిష్యత్ అసవరాలతో పాటు బడ్జెట్ రూపకల్పనకు తుదిరూపు ఇచ్చే అంశంపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. కేంద్రప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు వచ్చే అవకాశాలు లేవని ఇటీవలి కేంద్ర బడ్జెట్లో తేలిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు మారాయి. దీనిపై కూడా మంత్రివర్గంలో చర్చించనున్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభ తేదీ, నిర్వహణ, ప్రవేశపెట్టే బిల్లులు, ఆమోదం పొందాల్సిన పరిపాలనా ప్రతిపాదనలపై కూడా మంత్రివర్గం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పాలకమండలి గడువు ఈనెల 10వ తేదీతో ముగిసింది.
ఆ వెంటనే ప్రభుత్వం మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను నూతనంగా ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీతో పాటు వీటికీ ఎన్నికలు నిర్వహించే అంశంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికారపార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకొని, ఉత్సాహంగా ఉన్న నేపథ్యంలో ఈ కార్పొరేషన్ల ఎన్నికలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపైనా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. జీహెచ్ఎంసీతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలా లేక వేర్వేరుగా చేపట్టాలా అనే అంశాలపై సందిగ్థత ఉంది. దీన్ని కూడా చర్చిస్తారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో పెండింగ్లో ఉన్న అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు ఈ పెండింగ్ అంశాలను ప్రజాక్షేత్రంలోకి విస్త్రుతంగా తీసుకెళ్తున్న విషయం తెలిసిందే.
నేడు క్యాబినెట్ భేటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



