‘మత్తు వదలరా.. నిద్దుర మత్తు వదలరా… ఆ మత్తులోన పడితే గమ్మత్తుగ చిత్తవుదురా…’ అన్నారో సినీ కవి. అప్పట్లో ఆయన నిదుర మత్తు గురించే చెప్పారు. కానీ ఇప్పుడు అనేక రకాల ‘మత్తు పదార్థాలు’ మన జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. గంజాయి, కొకైన్, హెరాయిన్ తదితర మత్తు పదార్థాలు తెలంగాణలో విచ్చలవిడిగా దొరుకు తున్నాయి. పాన్ డబ్బాలు మొదలుకుని ఫైవ్ స్టార్ హోటల్ వరకూ ఎక్కడ పడితే అక్కడ ఇవి అందుబాటులో ఉండటం కలవరపరిచే అంశం. గతంలో పబ్బులు, క్లబ్బుల్లో, అసాంఘీకశక్తులు, మాఫియా ఏరియాల్లో వీటిని పట్టు కున్నారనే వార్తలను వినేవాళ్లం. కానీ ఇప్పుడు విశ్వవిద్యాలయాలు, కళాశాలల చుట్టుపక్కల ఇవి రాజ్యమేలుతుండటం అత్యంత ఆందోళనకరం. ఇంటర్, పదో తరగతి చదివే పిల్లలు కూడా వీటి బారిన పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం… గత ఫిబ్రవరి నుంచి మే వరకు నాలుగు నెలల కాలంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఎన్డీపీఎస్ (నార్కోటిక్స్ డ్రగ్స్ సైకో ట్రాఫిక్ సబ్స్టాన్సెస్) కింద 1,531 కేసులు నమోదయ్యాయి. ఇందుకు సంబంధించి 2,666 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 8,387 కిలోల గంజాయిని, 845 గంజాయి మొక్కలను, 32 కిలోల ఆల్పోజోలంను పట్టుకున్నారు. ఇవిగాక 16.22 కిలోల హషీప్ ఆయిల్, 1.1 కిలోల గంజాయి ఆయిల్, 6.35 కిలోల ఓపీఎం, 683.81 గ్రాముల ఎండీఎంఏతోపాటు 75 ఎల్ఎస్డీ బ్లాస్ట్స్, ఇతర నిషేధిత పదార్థాలను పట్టుకున్నారు. మొత్తం 710 వాహనాలను సీజ్ చేశారు. హైదరాబాద్లోని ధూల్పేటలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా 111 కేసులు నమోదు చేసి 456 కిలోల గంజాయిని పట్టుకున్నామన్నది అధికారిక వర్గాల లెక్క.
ఈ గణాంకాలను బట్టి మన రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు ఎంతగా వినియోగమవుతున్నాయో, తద్వారా యువత జీవితాలు ఏ మేరకు చిత్తవుతున్నాయో విదితమవుతున్నది. ఇంతటి భయానక పరిస్థితుల్లో ఉన్న తెలంగాణను కాపాడుకోవటం, యువతను దాన్నుంచి బయట పడేయటం ప్రభుత్వ బాధ్యత. ఇదే సమయంలో అసలు మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాలకు ఈడ్రగ్స్లో ఎక్కువ భాగం ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి…? ఎలా సరఫరా అవుతున్నాయి? అనేది పరిశీలించాల్సిన అంశం. అప్పుడే సమస్యకు మూలాలు, పరిష్కా రాలు దొరుకుతాయి. దేశంలోని అనేక ప్రాంతాలకు గుజరాత్లోని పోర్టుల నుంచే ఈ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు సరఫరా అవుతున్నాయనేది పోలీస్ డిపార్టుమెంటు చెప్పే వివరణ. అక్కడున్న పోర్టుల్లో అత్యధిక భాగం అదానీకే చెందినవే. ఇది బహిరంగ రహస్యం. అయినా కేంద్ర ప్రభుత్వం, దాని నిఘా విభాగాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరి స్తుండటం అత్యంత శోచనీయం. మోడీ సర్కారుకు, అదానీ కంపెనీలకు ఉన్న బలమైన బంధానికి ఇది అసలు సిసలు ఉదాహరణంటూ ఉన్నతాధికారవర్గాలు చెబుతుండటం గమనార్హం.
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ సైతం తాజాగా డ్రగ్స్పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సినీ నటులు రాంచరణ్ తేజ, విజరు దేవరకొండ తదితర సెలబ్రిటీలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ యువతకు మంచి సందేశమిచ్చారు. ఇంతవరకూ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. కానీ ఇది మాత్రమే సరిపోదు. రాష్ట్రంలోకి డ్రగ్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో పరిశీలించాలి. ముఖ్యంగా గుజరాత్ నుంచి వచ్చే మత్తు పదార్థాలను నిఘాపెట్టి, వాటిని నియంత్రించాలి. పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులు వాటి బారిన పడకుండా నిరోధించాలి. ఇందులో భాగంగా చిన్నతనం నుంచే ప్రతీ స్కూల్, కాలేజీలో విద్యార్థులకు వీటిపై అవగాహన కల్పించాలి. ప్రతీయేటా విధిగా సదస్సులు, సెమినార్లు నిర్వహించి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలి. గతేడాది కేరళ ప్రభుత్వం ఇదే రకమైన కార్య చరణను ప్రకటించి అమలు చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్… ఈ క్యాంపెయిన్ను లాంఛనంగా ప్రారంభించారు. ప్రతీ పాఠశాల, కళాశాలలో ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేసి, ఆయన ప్రసంగాన్ని ప్రతక్ష్య ప్రసారం చేశారు. డ్రగ్స్ నిర్వహణకు తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతోపాటు, వాటికి దూరంగా ఉండేందుకు విద్యార్థులు, యువత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సీఎం వివరించారు. ఈ కార్యక్రమాన్ని దాదాపు నెలరోజుల పాటు కొనసాగించారు. అలాంటి ప్రక్రియే ఇప్పుడు తెలంగాణలోనూ జరగాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూనుకోవాలి.
మత్తు వదలరా..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES