ఆర్థికవేత్తలు పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి అభూత కల్పనలు చాలానే అల్లారు. అటువంటి కల్పనల్లో డేవిడ్ రికార్డో అల్లినది రెండు శతాబ్దాలకు పైనే కొనసాగింది. యంత్రాలను ప్రవేశ పెట్టడాన్ని మొదట్లో చాలా ఉత్సాహంగా ఆహ్వానించినవాడు రికార్డో. అతని కాలంలో కార్మిక సంఘాలు… యంత్రాల ప్రవేశం వల్ల నిరుద్యోగం పెరుగుతుందని చేసిన వాదనలన్నింటినీ అతడు తోసిపుచ్చాడు. ”ఆర్థిక సూత్రాలు” అన్న అతడి గ్రంథం మూడవ ప్రచురణలో మాత్రం ఒక అధ్యాయాన్ని ప్రత్యేకంగా యంత్రాల గురించి అదనంగా చేర్చాడు. అందులో యంత్రాల ప్రవేశం వల్ల నిరుద్యోగం పెరుగుతుందని రికార్డో అంగీకరించాడు. ఐతే, అది తాత్కాలికమేనని, యంత్రాల వల్ల లాభాల రేటు పెరుగుతుంది కనుక సంపద పోగు పడడానికి, వృద్ధి వేగవంతం కావడానికి అది తోడ్పడుతుందని, దీర్ఘకాలంలో దాని వలన మరిన్ని ఎక్కువ ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని వాదించాడు.
రికార్డో వాదనను కార్ల్మార్క్స్ తన ”అదనపు విలువ సిద్ధాంతం” లో చాలా నిశితంగా విమర్శించాడు. రికార్డో వాదన పలు కారణాల రీత్యా తప్పు అని స్పష్టం చేశాడు. మొదటిది: రికార్డో యంత్రాలను ప్రవేశ పెట్టడం అనేది ఏదో ఒకసారి మాత్రమే జరిగే ప్రక్రియగా పరిగణించాడు. కాని పెట్టుబడిదారీ సమాజంలో సాంకేతిక మార్పులు అనేవి నిరంతరం జరిగే ప్రక్రియ. ఒక స్థాయి యంత్రాలకు బదులు మరొక స్థాయి యంత్రాలను తరచూ ప్రవేశ పెడుతూనే వుంటారు. అటువంటి సాంకేతిక పురోగతి ఫలితంగా లాభాల రేటు, సంపద పోగుబడడం అనేది పెరుగుతూనే వుంటుంది. అందుచేత అటువంటి యాంత్రీకరణ ఫలితంగా అందరికీ ఉపాధి కల్పించే పరిస్థితి అంతకంతకూ దూరమైపోతూ వుంటుంది.
రెండవది: సే సూత్రం చెల్లుబాటు అవుతుందని రికార్డో భావించి దాని ప్రాతిపదికన తన వాదనను రూపొందించాడు. ఆ సూత్రం ప్రకారం ”స్థూల డిమాండ్కు ఏనాడూ కొరత ఉండదు. పెట్టుబడిదారుల వద్ద పోగుబడిన సంపదనంతటినీ మళ్ళీ పెట్టుబడుల రూపంలో పెడతారు గనుక పోగుబడే సంపద పెరిగిన మేరకు పెట్టుబడులూ పెరుగుతూపోతాయి, దాని వలన అదనపు ఉపాధి అవకాశాలూ పెరుగుతూ పోతాయి. మార్కెట్ పెరుగుదలను అనుసరించి పెట్టుబడులు ఉండవు. ఎందుకంటే సంపదను డబ్బు రూపంలో దాచుకునేందుకు ఎవరూ సిద్ధంగా ఉండరు. అందువలన ఆ సంపద యావత్తూ పెట్టుబడులుగా మార్కెట్లోకి ప్రవేశిస్తుంది. దాని వలన ఉపాధీ పెరుగుతుంది. డిమాండ్ కూడా పెరుగుతుంది.” ఐతే ఈ వాదన అవాస్తవికమేగాక, తార్కికంగా కూడా చెల్లదు.
పెట్టుబడి ఎప్పుడూ మార్కెట్ పెరుగుదలను బట్టి ఉంటుంది అన్న వాస్తవాన్ని మనం గుర్తించినప్పుడు యంత్రాల ప్రవేశం కారణంగా కార్మికుల వేతనాల కోసం అంతవరకూ వెచ్చింనిన సొమ్ము తగ్గి లాభాలు పెరుగుతాయి. అదే సమయంలో లాభాలు పెరిగే రేటు తగ్గుతుంది. ఎలాగో చూద్దాం. యంత్రాల ప్రవేశం ఫలితంగా వెంటనే నిరుద్యోగం పెరుగుతుంది. శ్రామిక ఉత్పాదకత పెరుగు తుంది కాని వేతనాల ఖర్చు మాత్రం పెరగదు. అందువలన వేతనాలకు చేసే ఖర్చు తగ్గి లాభాలు పెరుగుతాయి. కార్మికుల వేతనాలను వారు దాదాపు పూర్తిగా ఖర్చు చేస్తారు. కాని లాభాల్లో ఒక చిన్న భాగాన్ని మాత్రమే యజమానులు ఖర్చు చేస్తారు. అందువలన మొత్తం ఆదాయంతో పోల్చినప్పుడు మొత్తం వినిమయం తగ్గుతుంది. దాని వలన సరుకులు చెల్లుబాటు కాకుండా మిగిలిపోతాయి. అధికోత్పత్తి స్థితి ఏర్పడుతుంది. దాని ఫలితంగా వాస్తవంగా సంపద పోగుబడే రేటు తగ్గిపోతుంది.
యంత్రాలను ప్రవేశ పెట్టడం వలన అంతిమంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న రికార్డో వాదనకు భిన్నంగా, వాస్తవానికి ఆ యాంత్రీకరణ ఉపాధి అవకాశాల పెరుగుదలను దెబ్బ తీస్తుంది. ఏదైనా ప్రత్యేక కాలాల్లో కొత్త యంత్రాలను వేటినీ ప్రవేశ పెట్టకుండా పాత స్థాయి యంత్రాలనే కొనసాగించినప్పుడు నిరుద్యోగం తగ్గవచ్చు. కాని అందుకు తొలుత చేపట్టిన యాంత్రీకరణ ఎంతమాత్రమూ కారణం కాదు. యాంత్రీకరణ కారణంగా ఎన్ని ఉద్యోగాలు పోయాయో వాటివరకూ అయినా తిరిగి కల్పించడం అనేది కొంతకాలం దాటిన తర్వాత కూడా జరగదు.
రికార్డో చిత్రించిన ఈ పెట్టుబడిదారీ రూపం పెట్టుబడిదారీ విధానానికి ప్రమాణంగా నేటికీ ఆమోదించబడుతోంది. మొదట్లో ఎన్ని ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా, అంతిమంగా పెట్టుబడిదారీ వ్యవస్థ అందరికీ సౌభాగ్యాన్ని అందిస్తుంది అని నమ్ముతూంటారు. ఐతే ఇది ఏమాత్రమూ వాస్తవం కాదు. పెట్టుబడిదారీ విధానం ప్రవేశపెట్టినప్పుడు తలెత్తే ఇబ్బందులను, కష్టాలను తర్వాత కాలంలో లేకుండా చేయగల ఏర్పాటు ఏదీ పెట్టుబడిదారీ విధానంలో లేనే లేదు.
ఇక్కడ ఒక ప్రశ్న రావొచ్చు. ప్రపంచంలో పెట్టుబడిదారీ విధానం మొదట ప్రారంభం అయిన పశ్చిమ యూరప్ దేశాలలో ప్రజల జీవన పరిస్థితులు ప్రారంభం నాటికన్నా తర్వాత కాలంలో వాస్తవంగా చాలా మెరుగుపడ్డాయి కదా? ఇదెలా జరిగింది?
పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి జరిగిన చారిత్రిక సందర్భాలు రెండు ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. మొదటిది: యూరప్ నుంచి చాలా భారీ సంఖ్యలో కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలకు వలసలు పోయారు. ఈ దేశాలన్నీ వారి ఆక్రమణకు గురయ్యాయి. వారంతా అక్కడే స్థిరపడ్డారు. ఆ తర్వాత కాలంలో యూరప్ నుంచి ఇండియా, చైనా, ఇండోనేషియా, ఇండో-చైనా వంటి దేశాలకు పోయినవారు వాటిని తమ వలసలుగా మార్చుకున్నారు. మొదటి దశలో వలసలు పోయిన ప్రదేశాల్లో భూములను ఆక్రమించుకున్నారు. వాటిని సాగు చేయసాగారు. అప్పుడు యూరప్లో ఉండిపోయిన కార్మికుల కనీస వేతనాల స్థాయి పెరిగింది. నిరుద్యోగమూ తగ్గింది. ఆ విధంగా ఈ వలసలు యూరప్లో యాంత్రీకరణ దుష్ఫలితాలైన నిరుద్యోగం వంటివి కొనసాగకుండా చేయగలిగాయి.
యూరప్ జనాభాతో పోల్చితే అక్కడి నుండి జరిగిన వలసల స్థాయి చాలా ఎక్కువ. దాదాపు 19వ శతాబ్దం అంతా, మొదటి ప్రపంచ యుద్ధం మొదలయే దాకా, యూరప్ నుండి వలసలు పోతూనే వున్నారు. వారు దాదాపు 5 కోట్ల మంది! బ్రిటన్ వంటి దేశంలోనైతే దేశ జనాభా వృద్ధి ఏటేటా ఎంత ఉండేదో, దాదాపు అందులో సగం మేరకు వలసలు ఉండేవి. ఇటువంటి స్థాయిలో వలసలు పోవడం, అది కూడా దీర్ఘకాలం పాటు కొనసాగడం వలన యూరప్ దేశాల్లో కార్మికులకు చాలా డిమాండ్ ఉండేది. ఆ దేశాలు యాంత్రీకరణ కారణంగా ఏర్పడిన నిరుద్యోగాన్నంతటినీ వలసల రూపంలో ఎగుమతి చేసేశాయని చెప్పవచ్చు. ఇది తమ తమ దేశాల హద్దులను దాటిపోయి ఇతర ప్రదేశాలను ఆక్రమించుకోడం కారణంగా జరిగిన పరిణామమే తప్ప అంతర్గతంగా ఆయా దేశాల్లోని పెట్టుబడిదారీ వ్యవస్థ పరిష్కరించినది కాదు.
ఇక రెండవ కారణం: తాము జయించి వలసలుగా మార్చుకున్న ఇండియా వంటి దేశాలలో స్థానికంగా ఉన్న పరిశ్రమలను నాశనం చేసి సామ్రాజ్యవాద వేశాలు తమ ఉత్పత్తులను ఆ వలస దేశాల మార్కెట్లలో ప్రవేశ పెట్టడం జరిగింది. అందువలన తమ స్వంత దేశాల్లో యాంత్రీకరణ కారణంగా తలెత్తే నిరుద్యోగాన్ని దేశీయ ఆర్థిక వ్యవస్థ ద్వారా గాక, ఇతర దేశాల్లో మార్కెట్లను ఆక్రమించడం ద్వారా పరిష్కరించుకున్నారు. ఇప్పటికీ మూడవ ప్రపంచ దేశాలలోని భారీ నిరుద్యోగాన్ని తమ స్వంత లాభాలను పెంచుకోడానికి వాడుకుంటూనే వున్నారు.
ఈ విధంగా పశ్చిమ దేశాల్లో యాంత్రీకరణ ఫలితంగా తలెత్తిన నిరుద్యోగాన్ని వలసలకు పోవడం ద్వారా, కొన్ని దేశాలను వలసలుగా మార్చి దోపిడీ చేయడం ద్వారా పరిష్కరించుకున్నారన్న చారిత్రిక కారణాలను పరిశీలించకుండా, ఆ పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థలలో యాంత్రీకరణ పర్యవసానాలను అక్కడి వరకే పరిశీలించడం వలన మనకు తప్పుడు నిర్ధారణలు వస్తాయి. ఆ దేశాల్లో యాంత్రీకరణ ఫలితంగా ఏర్పడిన నిరుద్యోగం తర్వాత కాలంలో అదృశ్యమైపోయినట్లే మన దేశంలో కూడా జరుగుతుందన్న భ్రమ కలుగుతుంది.
ప్రస్తుతం మూడవ ప్రపంచ దేశాలకు చాలా కీలకమైన సమస్య ఇది. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ అను నిత్యమూ సాగించే ప్రచారాన్ని దైవ వాక్కులాగా స్వీకరిస్తున్నారు. మూడవ ప్రపంచ దేశాలు పెట్టుబడిదారీ విధానాన్ని ఎటువంటి పరిమితులూ, నియంత్రణలూ లేకుండా అమలు జరిపితే కాలక్రమంలో మన దేశాలు కూడా పశ్చిమ యూరప్ దేశాల మాదిరిగా సంపన్న దేశాలు అయిపోతాయన్నదే ఆ ప్రచారం. పశ్చిమ యూరప్ అనుభవాన్ని ఉదాహరణగా చూపిించడం వలన వాస్తవాన్ని సక్రమంగా అర్ధం చేసుకోలేని స్థితి ఏర్పడుతోంది.
మన దేశంలో తొలి తరం ప్రణాళికావేత్తలు పి.సి.మహలనోబిస్ వంటి వారికి పశ్చిమ యూరప్ అభివృద్ధికి సంబంధించిన వాస్తవాలు పూర్తిగా తెలుసు. అందుకే వారు పెట్టుబడిదారీ విధానాన్ని దాని ఇష్టానికి వదిలి పెట్టలేదు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ నియంత్రణ తప్పనిసరిగా ఉండాలని వారు తలిచారు. అంతేకాక, చిన్న, కుటీర పరిశ్రమలను రక్షించడం ప్రభుత్వ విధానంలో భాగంగా ఉండాలని భావించారు. ఒకపక్క భారీ పరిశ్రమల స్థాపనను మహలనోబిస్ బలంగా సమర్ధిస్తూనే, రెండవ పంచవర్ష ప్రణాళిక నాటికి ఆయన ఉపాధి కల్పనకు, వినిమయ వస్తువులు ఎక్కువగా అందుబాటులోకి రావడానికి వీలుగా చిన్న, కుటీర పరిశ్రమల విస్తరణ జరగాలని నిర్దేశించారు. చైనాలో కూడా ఇదే కాలంలో ఇదే విధంగా ఆలోచనలు జరిగాయి. వలస విధానం నుండి విముక్తి పొందిన మూడవ ప్రపంచ దేశాలలో ఎక్కువ చోట్ల అమలు జరిగిందిదే.
ప్రస్తుతం దేశంలో ఆర్థిక విధానాల మీద చర్చ దయనీయంగా దిగజారింది. 200 సంవత్సరాల క్రితం పెట్టుబడిదారీ విధానం గురించి ప్రచారం చేసిన అభూత కల్పనలనే నేటికీ వాస్తవం అని భావిస్తూ ప్రచారం చేస్తున్నారు. మూడవ ప్రపంచ దేశాల్లో, మన దేశంతో సహా, పేదరికం తగ్గిపోయిందంటూ అబద్ధాలను ప్రచారం చేస్తూ అభూత కల్పనలను సమర్ధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ అభూత కల్పనల నుండి ఎంత త్వరగా బైట పడితే దేశానికి అంత మంచిది.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్
పెట్టుబడిదారీ వ్యవస్థ-కొనసాగుతున్న అభూత కల్పనలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES