నవతెలంగాణ-హైదరాబాద్ : ఒక కారు అదుపుతప్పింది. రౌండ్ తిరిగి మెట్రో పిల్లర్ను ఢీకొట్టింది. దీంతో ఆ కారు రెండు ముక్కలైంది. అందులో ప్రయాణించిన వారిలో ఇద్దరు యువకులు మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4.40 గంటల సమయంలో రోడ్డుపై వేగంగా వెళ్తున్న నల్లటి కారు అదుపుతప్పింది. బండ్ గార్డెన్ మెట్రో స్టేషన్ పిల్లర్ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ కారు రెండు ముక్కలైంది.
కాగా, ఆ కారులో ప్రయాణించిన ముగ్గురిలో కజిన్లు అయిన 23 ఏళ్ల యాష్ భండారి, హృతిక్ భండారి అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి కుష్వంత్ టెక్వానీ తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన కారులో మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ కంట్రోల్ తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.



