ఫుట్పాత్పై నిద్రిస్తున్న తండ్రీకొడుకు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘటన
నవతెలంగాణ- రాజేంద్రనగర్
ఓవర్ స్పీడ్లో ఉన్న ఇన్నోవా కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న దుకాణాలపైకి దూసుకెళ్లడంతో పుట్పాత్పై వేసుకున్న గుడిసెలో నిద్రిస్తున్న తండ్రీకొడుకు మృతిచెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రభు మహారాజ్(55) తన ఇద్దరి కొడుకులైన దీపక్(25), సత్తునాథ్తో కలిసి కాటేదాన్ ప్రాంతానికి వలస వచ్చారు. మైలార్దేవ్పల్లి ప్రధాన రహదారి పక్కన చిన్న గుడిసె ఏర్పాటు చేసుకొని రగ్గులు, దుప్పట్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు.
రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి దుప్పట్లు అమ్మి గుడిసెలో తన ఇద్దరి కొడుకులతో కలిసి నిద్రపోయాడు. అయితే తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో శంషాబాద్ నుంచి ఎల్బీనగర్ వెళ్తున్న ఇనోవా కారు ఓవన్ స్పీడ్లో రావడంతో అదుపుతప్పి ఫుట్పాత్పై గుడిసెలో నిద్రిస్తున్న వారిపై నుంచి వెళ్ళింది. దాంతో దీపక్ అక్కడికక్కడే మృతి చెందగా మహారాజ్, సత్తునాథ్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ప్రభు మహారాజ్ మృతి చెందాడు. కారులో ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



