నవతెలంగాణ -హైదరాబాద్
బీజేపీ పరువు ప్రతిష్టలు దెబ్బతీసేలా గతేడాది మే 4న కొత్తగూడెంలో జరిగిన జన జాతరలో సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించారంటూ బీజేపీ పెట్టిన కేసు విచారణను హైకోర్టు నిలిపేసింది. ఈ మేరకు గురువారం జస్టిస్ కె.లక్ష్మణ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటరు దాఖలు చేయాలంటూ ఫిర్యాదుదారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లును ఆదేశించారు. విచారణను ఈనెల 23కు వాయిదా వేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దవుతాయని రేవంత్ ఆరోపణల వల్ల తమ పార్టీ పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నా యంటూ కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి ప్రత్యేక కోర్టులో ప్రయివేటు ఫిర్యాదు చేశారు. దీనిని కొట్టేయాలన్న రేవంత్ పిటిషన్లో ఫిర్యాదుదారు వెంకటేశ్వర్లు కౌంటరు దాఖలు చేయకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది. అప్పటివరకు కింది కోర్టులో కేసు విచారణపై స్టే విధించింది.
మెట్రో పనులను చేపట్టొద్దు
హైదరాబాద్ మెట్రో రైల్వే ప్రాజెక్ట్ రెండో దశలో చార్మినార్, ఫలక్నుమాల సమీపంలో పనులు చేపట్దొద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. వారసత్వ కట్టడాల పరిరక్షణపై ఎలాంటి అధ్యయనం చేయకుండానే మెట్రో నిర్మాణాలు చేసేందుకు ప్రణాళికను రూపొందించా రనీ, మెట్రో కారిడార్-6 పనులు చేపట్టడాన్ని వ్యతిరేకిస్త్తూ యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ (ఏపీడబ్ల్యూఎఫ్) హైకోర్టులో వేసిన పిల్ను యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజరుపాల్, జస్టిస్ యారా రేణుకలతో కూడిన బెంచ్ గురువారం విచారించింది. మెట్రో పనుల కారణంగా వారసత్వ కట్టడాలైన చార్మినార్, ఫలక్నుమాతోపాటు పలు నిర్మాణాలకు ప్రమాదం పొంచి ఉందని పిటిషనర్ లాయర్ వాదించారు. తెలంగాణ వారసత్వ కట్టడాల రక్షణ చట్టం, కేంద్ర పురావస్తుశాఖ చట్ట నిబంధనల ప్రకారం అనుమతు లు తీసుకున్నాకే నిర్మాణాలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కౌంటరు దాఖలు చేయడానికి మూడు వారాల గడువు కావాలని ప్రభుత్వం కోరింది. ఇందుకు అనుమతిచ్చిన హైకోర్టు అప్పటి వరకు పనులు చేయరాదని ఆదేశించింది.
అక్రమ నిర్మాణలపై కుంటిసాకులా?
అక్రమ నిర్మాణాలపై తక్షణం చర్యలు తీసుకోకుండా కుంటి సాకులు చెబుతున్న నల్లగొండ మున్సిపల్ అధికారు లపై హైకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చి వేత ఉత్తర్వులు 2022లో జారీ అయినా ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. పరస్పర లేఖల తో కాలయాపన చేయకపోతే తక్షణం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. నల్లగొండ గొల్లగూడలో అక్రమం గా నిర్మించిన భవనాన్ని కూల్చి వేయాలంటూ 2022లో మున్సిపల్ కమిషనర్ ఆదేశాలిచ్చినా అమలు చేయక పోవడంపై 83 ఏండ్ల కె.రాములమ్మ వేసిన పిటిషన్ను జస్టిస్ బి.విజరుసేన్రెడ్డి విచారించారు. విద్యుత్తు, నీటి సరఫరా నిలిపివేతకు లేఖలు రాశామని, ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి కూల్చివేత చర్యలు చేపట్టాలని లేఖ రాసినట్టు ప్రభుత్వ లాయర్ చెప్పారు. కూల్చివేత చర్యలు తీసుకుని రిపోర్టు ఇవ్వాలని ఆదేశించిన న్యాయమూర్తి విచారణను జులై మూడుకు వాయిదా వేశారు.
నిర్మాణం ఆపండి
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ పనులను చేపట్టొద్దంటూ హైకోర్టు గురువారం ఆదేశించింది. అనుమతుల్లేకుడా నిర్మాణాలు కొనసాగిస్తుం డటం సరికాదంది. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ను అనుమతుల్లేకుండా నిర్మిస్తున్నా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను జస్టిస్ బి.విజరుసేన్రెడ్డి గురువారం విచారించారు. జీహెచ్ఎంసీ అనుమతుల్లేని నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ నిర్మాణాలు జరుగుతున్నా యని లాయర్ చెప్పారు. వాటి ఫొటోలు తీసిన పిటిషనర్లపై కేసులు పెట్టారన్నారు. వాదనల తర్వాత హైకోర్టు, అనుమతుల్లేని నిర్మాణ పనులను నిలిపివేయా లన్నారు. వీటిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను జులై మూడుకు వాయిదా వేసింది.
మోహన్బాబుపై కేసులో రిపోర్టు ఇవ్వండి
పోలీసులకు హైకోర్టు నోటీసులు
రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో విలేకరిపై దాడి చేశారంటూ సినీ నటుడు మోహన్బాబుపై పెట్టిన కేసులో దర్యాప్తు నివేదిక ఇవ్వాలని పహాడీషరీఫ్ పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. మోహన్బాబుపై ఫిర్యాదు చేసిన రంజిత్కుమార్కు నోటీసులు జారీ చేయాలంది. విలేకరిపై దాడికి సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మోహన్బాబు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం విచారించారు. విచారణను ఈనెల 24కు వాయిదా వేశారు.
సీఎం రేవంత్పై కేసు విచారణ నిలిపివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES