అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవు
కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్ పి శరత్ చంద్ర పవార్ హెచ్చరిక
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
అధిక ధరలకు యూరియాను విక్రయిస్తున్న నల్గొండ జిల్లా, నల్గొండ మండలం, దోమలపల్లి శ్రీ కనకదుర్గ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ & సీడ్స్ దుకాణ యజమాని పగిడిమర్రి విగ్నేష్, సహాయకులు మొగుదాల శివ, శీలం లింగమూర్తిలపై కేసు నమోదు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవార్ లు ఒక ప్రకటనలో తెలిపారు. నల్గొండ మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రోజువారీ తనిఖీలలో భాగంగా బుధవారం తన సిబ్బందితో మండల పరిధిలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన సందర్భంగా,నల్గొండ మండలం, దోమలపల్లి గ్రామంలో ఉన్న శ్రీ కనకదుర్గ ఫర్టిలైజర్స్, ఫస్టిసైడ్స్ & సీడ్స్ దుకాణాన్ని తనిఖీ చేయడం జరిగిందని అన్నారు.
ఆ సమయంలో ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న యూరియా ధరలను, యూరియా స్టాక్ వివరాలను దుకాణం ఎదుట పట్టికలో ప్రదర్శించలేదని, ఈ విషయం గమనించిన అధికారులు దుకాణంలో ఎరువులు అమ్మిన రశీదు బుక్కుల ఆధారంగా యూరియా కొనుగోలు చేసిన కల్వలపల్లి గ్రామానికి చెందిన వంటేపాక సైదులు, కన్నెబోయిన శంకర్, బీరెల్లిగూడెం కు చెందిన దాసరి బిక్షంలు బస్తా యూరియా 266/ రూపాయల ఎంఆర్ పి ధరకు బదులుగా, 350/- రూపాయలకు కొనుగొలు చేసినట్లు గమనించడం జరిగిందని తెలిపారు. అంతేకాక ఇదే విషయాన్ని సదరు షాపు నుండి యూరియాను కొన్న పైన పేర్కొన్న రైతులతో పాటు, మరికొంతమంది రైతులు వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వ్యయ ప్రయాసల కోర్చి యూరియాను సరఫరా చేస్తుండటం, అంతేగాక ,ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతులందరికీ యూరియాను అందించేందుకు చర్యలు తీసుకుంటుండగా, రైతులను మోసం చేసి అధిక ధరలకు యూరియాను విక్రయిస్తున్నందుకు గాను పై ముగ్గురిపై బి ఎన్ ఎస్ ఆక్ట్ (భారతీయ న్యాయ సంహిత), సెక్షన్ 318 (4) , నిత్యావసర వస్తువుల చట్టం సెక్షన్-7 మరియు ఎరువుల నియంత్రణ ఆర్డర్ చట్టం-1957 ,సెక్షన్ 19 ,తదితర చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
యూరియాను అధిక ధరలకు విక్రయించడం, పక్కదారి పట్టించడం, అక్రమాలకు పాల్పడడం వంటి చర్యలకు ఎవరు పాల్పడినా సహించబోమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని, అవసరమైతే పి డి ఆక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.