నవతెలంగాణ – హైదరాబాద్ :‘కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది’ అని ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో దుమారం రేపుతున్నాయి. తన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ ఆడియో రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కన్నడిగుల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ క్రమంలో కమల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కర్ణాటక రక్షణ వేదిక (కేఆర్వీ) రంగంలోకి దిగింది. బెంగళూరులోని ఆర్టీ నగర్ పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేసింది.
కమల్ వ్యాఖ్యలు కన్నడిగుల మనోభావాలను దెబ్బతీశాయని, కన్నడిగులు, తమిళుల మధ్య విద్వేషాలను సృష్టించేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొంది. ఆయనపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేఆర్వీ డిమాండ్ చేసింది. దీంతో కమల్పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.