ఐదేండ్లలో 263 పశువులను చంపిన పులులు..
పులి చంపిన ఆవుల యజమానులకు నష్టపరిహారం చెల్లిస్తున్నాం: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వీరేష్
నవతెలంగాణ – అచ్చంపేట
నల్లమల్ల అడవులకు పశుగాసం కోసం వెళ్ళిన పశువులు పులులకు ఆహారంగా మారుతున్నాయి. గ్రామాలలో ప్రస్తుత కొరత కారణంగా జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి కొందరు రైతులు మేత కోసం ప్రత్యేకంగా పశువులను నల్లమల అడవికి తీసుకెళ్తారు. ఈ క్రమంలో పెద్ద పులులు పశువుల దాడి చేసి చంపుతున్నాయి. దీంతో పశువుల యజమానులు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2020- 2021 నుంచి 2025- 2026 వరకు 263 పశువులను పెద్ద పులులు చంపినట్లు అటవీశాఖ అధికారులు లెక్కలు చెబుతున్నారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ పరిధిలో పులి దాడిలో చనిపోయిన పశువుల యజమానులకు నష్టపరిహారం చెల్లిస్తున్నామని అటవీ శాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వీరేష్ శనివారం తెలిపారు. 2020–21లో 33 పశువులకు రూ.3.69 లక్షలు, 2022–23లో 85 పశువులకు రూ.11.75 లక్షలు, 2023–24లో 81 పశువులకు రూ.8.93 లక్షలు, 2024–25లో 58 పశువులకు రూ.5.51 లక్షలు, 2025–26లో 6 పశువులకు రూ.79 వేల పరిహారం యజమానులకు చెల్లించామని ఆయన వివరించారు.