కరుడుగట్టిన నిందితుల కోసం దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో గాలింపు
13 సైబర్ క్రైమ్ కేసుల్లో 20 మంది అరెస్ట్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎన్ని చర్యలు తీసుకున్నా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి.. సైబర్ నేరాలపట్ల క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించినా ఆశించినంత మేరకు ఫలితాలు రావడం లేదు. ఈ క్రమంలో సైబర్క్రైమ్ పోలీసులు దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ముంబయి, ఢిల్లీ, బెంగళూర్, గోవా, కేరళం, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్లో అడ్డాలుగా మార్చు కున్న సైబర్ నేరస్థులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిం చారు. ఐదు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. 13 సైబర్ కేసుల్లో 20 మందిని అరెస్టు చేశారు.
54 ఎఫ్ఐఆర్లు నమోదు
గత మార్చి నెలలో హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అనేక ఫిర్యాదులను స్వీకరించారు. వాటిలో 54 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆపరేషన్ను చేపట్టిన పోలీసులు 13 సైబర్ క్రైమ్ కేసుల్లో 20 మందిని అరెస్టు చేశారు. వారిలో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ (పెట్టుబడి మోసం)లో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు ట్రేడింగ్ ఫ్రాడ్లో ఒకరిని, గేమింగ్ ఫ్రాడ్ 8 మంది, జాబ్ ఫ్రాడ్ (ఉద్యోగ మోసం)లో ఇద్దరు, సోషల్ మీడియాతోపాటు మాట్రిమోనియల్ ఫ్రాడ్ (వివాహ సంబంధాల మోసం)లో ముగ్గుర్ని, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్లో ఒకరు, ఇంపర్సనేషన్ ఫ్రాడ్ (మభ్యపెట్టడం) కేసులో మరో నిందితుడిని అరెస్టు చేశారు. బాధితులకు రూ.1,59,69,564 రీఫండ్ (తిరిగి చెల్లింపు) చేయించారు.
జోనల్ సైబర్ సెల్స్..
జోనల్ సైబర్ సెల్స్ 3081 ‘ఎన్సీఆర్పీ’ పిటిషన్లు స్వీకరించగా, వాటిలో 276 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. నాలుగు కేసుల్లో నలుగుర్ని అరెస్టు చేసిన పోలీసులు బాధితులకు రూ.95,99,399/- రీఫండ్ చేయించారు. మార్చి నెలలో వివిధ సైబర్ నేరాలకు సంబంధించి మొత్తం 23 కేసుల్లో బాధితులు రూ.4,40,11,016 పోగొట్టుకోగా, పోలీసులు, బ్యాంకింగ్ అధికారుల సమన్వయంతో బాధితులకు రీఫండ్ (తిరిగి చెల్లింపు) చేయించారు.
129 ప్రొఫైళ్లను గుర్తించిన ఎన్ఫోర్స్మెంట్ వింగ్
సైబర్ పెట్రోలింగ్, డిజిటల్ మానిటరింగ్ ద్వారా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్ గేమింగ్ మరియు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న 129 ప్రొఫైళ్లను పోలీసులు గుర్తించారు. ఇవి భారతదేశంలోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని 494 పెయిడ్ అడ్వర్టైజ్మెంట్లను నడుపుతున్నాయి. యువతకు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించొచ్చనే ఆశ చూపించి అక్రమ బెట్టింగ్లలోకి లాగుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఈ 129 ప్రొఫైళ్లను ఆయా సోషల్ మీడియా సంస్థలకు నివేదించి తొలగించారు. పోలీసులు కొత్తగా ప్రవేశపెట్టిన సీ- మిత్రా ద్వారా బాధితులకు పోలీసులు అవసరమైన సహాయసహకారాలు అందిస్తున్నారు. ఈ యాప్కు మొత్తం 1,730 కాల్స్ చేశారు. ఫిర్యాదుల ఆధారంగా 262 జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
‘జాగృత్ హైదరాబాద్ – సురక్షిత్ హైదరాబాద్’
సైబర్ నేరాలపట్ల అవగాహన కల్పించేందుకు ‘సైబర్ సింబా’ వాలంటీర్ కార్యక్రమానికి హైదరాబాద్ పోలీసులు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా సుమారు 500 మంది సైబర్ సింబా వాలంటీర్లు నమోదు చేసుకుని పాల్గొన్నారు. వీరికి సాధారణ గ్రీటింగ్స్ కాకుండా, వాట్సప్ గ్రూపుల ద్వారా సైబర్ భద్రతా సందేశాలను పంచుకోవాలని, ఇంటింటి ప్రచారం చేయాలని సూచించారు. ఈ అవగాహన వల్ల రోజువారీ సైబర్ ఫిర్యాదులు 80 నుంచి 60కి తగ్గాయి.
నకిలీ ప్రొఫైళ్లతో జాగ్రత్త: సీపీ
నకిలీ ప్రొఫైళ్లతో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ప్రజలకు సూచించారు. సీనియర్ అధికారుల పేరుతో వచ్చే మనీ రిక్వెస్ట్లు లేదా ఫ్రెండ్ రిక్వెస్ట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అధికారిక మార్గాల ద్వారా నిర్ధారించుకోకుండా డబ్బులు పంపొద్దని చెప్పారు. టెలిగ్రామ్, వాట్సప్ వంటి వాటిలో అధిక లాభాలు ఆశచూపే గ్రూపులను నమ్మొద్దన్నారు. బ్యాంకులు ఎప్పుడూ వాట్సప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా ఫైళ్లను పంపవన్నారు. గుర్తు తెలియని లింక్లపై క్లిక్ చేయొద్దని సూచించారు. సోషల్ మీడియాలో పరిచయమై, నమ్మకం కుదిరిన తర్వాత వ్యక్తిగత వీడియోలను రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ (సెక్స్టార్షన్) చేసే అవకాశం ఉందన్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయండి లేదా షషష.షybవతీషతీఱఎవ.స్త్రశీఙ.ఱఅలో ఫిర్యాదు చేయాలని సూచించారు. త్వరగా రిపోర్ట్ చేయడం వల్ల మీ డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుందని సీపీ చెప్పారు.
సీసీఎస్ పోలీసుల అంతర్రాష్ట్ర ఆపరేషన్స్ సక్సెస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



