– అమెరికాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు
– పార్లమెంటరీ ప్యానెల్కు స్పష్టం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : పాకిస్తాన్తో కాల్పుల విరమణ గురించి అమెరికాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని శశిధరూర్ నేతృత్వంలో విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ ప్యానల్కు కేంద్రం తెలిపింది. ఈ కాల్పుల విరమణలో అమెరికా ప్రమేయం లేదని కూడా స్పష్టం చేసింది. వివిధ పార్టీలకు చెందిన 23 మంది సభ్యులు ఉన్న ప్యానెల్తో కేంద్ర ప్రభుత్వం తరుపున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి, ఇతర అధికారులు సోమవారం మూడు గంటల పాటు సమావేశమయ్యారు. ప్యానెల్లో సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు మిస్రి, అధికారులు సమాధానం ఇచ్చారు. భారత్-పాకిస్తాన్లు కాల్పుల విరమణ ప్రకటించకముందే అమెరికా అధ్యక్షులు ట్రంప్ మొదటగా ఈ విషయాన్ని ప్రకటించారో వివరణ ఇవ్వాలని సిపిఎం ఎంపి జాన్ బ్రిట్టాస్ కోరారు. దీనికి ప్రభుత్వంపై విధంగా సమాధానం ఇచ్చింది. అమెరికా అధికారులతో చర్చలు ఒక సాధారణ ప్రక్రియలో భాగమని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని భారత్ జోక్యం చేసుకోవడంతో సమానంగా దీన్ని చూడాలని, ఇతర దేశాలు కూడా భారత్-పాక్పై ఇదే స్పందించడం సహజమని అధికారలు వివరించారు. మూడో పక్షం మధ్యవర్తిత్వం ఉండకూడదనే విధానం నుంచి భారత్ తప్పుకోలేదని వివరించారు. అలాగే, దాడుల గురించి ముందుగానే పాకిస్తాన్కు సమాచారం ఇచ్చారనే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కూడా మిస్రి, అతని బృందం ఖండించింది. మొదటి దాడి తరువాతే ఆపరేషన్ సిందూర్ గురించి భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్తో మాట్లాడారని తెలిపారు. అలాగే ఇటీవల కాలంలో పాకిస్తాన్ ప్రోత్సహించే ఉగ్రవాద కార్యకలాపాలు భారత్లో పెరిగాయని మిస్రి ప్యానెల్కు వివరించారు. గత ఏడాదిలో 24 ఉగ్రదాడులు జరిగాయిని, ఇందులో 24 మంది భద్రతా సిబ్బంది, 30 మందికి పైగా సాధారణ ప్రజలు మరణించారని మిస్రి చెప్పారు. కాగా, సమావేశం తరువాత థరూర్ విలేకరులతో మాట్లాడుతూ సభ్యులు అడిగిన అనేక ప్రశ్నలకు మిస్రి, అధికారులు సంతృప్తికరంగా సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో సమగ్రమైన చర్చ జరిగిందని తెలిపారు. ఇటీవల సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్న మిస్రికి ప్యానెల్ సంఘీభావం తెలిపినట్లు చెప్పారు. మిస్రికి సంఘీభావంగా ఒక తీర్మానం ప్రవేశపెట్టాలనుకున్నా, దాని వద్దని మిస్రి స్వయంగా అభ్యర్థించారని థరూర్ విలేకరులకు తెలిపారు.
పాక్తో కాల్పుల విరమణపై
- Advertisement -
- Advertisement -