– వ్యవసాయ రుణ ప్రణాళికను విడుదల చేయాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ- మరిపెడ
”జూన్ మొదటి వారంలో తెలంగాణ సంబురాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ వార్షికోత్సవ సంబురాలు జరుపుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. మీ సంబురాలు సరే.. రైతు కూలీల, కార్మిక సమస్యల సంగతేమిటి..” అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తడిసిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని కనకదుర్గ ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం పదిరోజుల ముందే రుతుపవనాలు వచ్చాయని, దాంతో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని, అయినా ఇప్పటికీ ప్రభుత్వం వ్యవసాయ ప్రణాళికలు చేయలేదని అన్నారు. రుణ ప్రణాళికలు సిద్ధం చేయకుండా, ప్రణాళిక అంచనాలను ప్రకటించకుండా ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ఎలా ప్రారంభించాలని చూస్తుందని ప్రశ్నించారు. వ్యవసాయ రుణ ప్రణాళికను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. వ్యవసాయ కూలీల పని దినాలు రోజురోజుకు పడిపోతున్నాయని, ఉపాధి పనులు లేక అనేక మంది కూలీలు ఇతర ప్రాంతాలకు వలసలు బోతున్నారని అన్నారు. వ్యవసాయ కూలీలు అసంఘటితరంగ కార్మికుల సమస్యలను పట్టించుకోవాలని, లేకుంటే కార్మికవర్గం ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు తప్పవని హెచ్చరించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. గతేడాది జులై, ఆగస్టు నెలల్లో వరదలకు అనేక కుంటలు, చెరువులు ధ్వంసమయ్యాయని, ఆకేరు, పాలేరు వాగులు దెబ్బతిన్నాయని అయినా వాటి మరమ్మతులు ఇప్పటికీ చేపట్టలేదని తెలిపారు. ఆనాడే సీఎం వచ్చి పురుషోత్తమాయగూడెం ఆఖరి బ్రిడ్జి తండావాసులకు హామీలు ఇచ్చినా ఇప్పటికీ నెరవేరలేదని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గునుగంటి రాజన్న, సూర్నుపు సోమన్న, ఆకుల రాజు, అలువాల వీరయ్య, కుంట ఉపేందర్, కందనూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
సంబురాలు సరే..సమస్యల సంగతేమిటి..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES