Thursday, June 12, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఆహార సబ్సిడీకి కేంద్రం మోకాలడ్డు

ఆహార సబ్సిడీకి కేంద్రం మోకాలడ్డు

- Advertisement -

భారీగా తగ్గించిన మోడీ సర్కార్‌
రాష్ట్రాలపై పడనున్న భారం
పరోక్షంగా పేదలకు తప్పని తిప్పలు

కేంద్రంలో ఎన్డీఏ సర్కారు అనుసరిస్తున్న ఆహార సబ్సిడీ విధానం ప్రజలకు భారంగా మారుతున్నది. ఒకవైపు 2029 వరకు దేశంలో 80 కోట్ల మందికి ఉచిత ఆహార పంపిణీ (బీపీఎల్‌ కుటుంబాల్లో ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పున) చేస్తామని నమ్మబలుకుతున్న మోడీ ప్రభుత్వం మరోవైపు అందుకు తగ్గట్టు బడ్జెట్‌ కేటాయింపులు మాత్రం చేయడం లేదు. దేశంలో దారిద్య్రరేఖకు దిగువన వెళ్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న క్రమంలో ఆహార సబ్సిడీకి నిధులు పెరగాల్సి ఉండగా, అందుకు భిన్నంగా నిధులను తగ్గించడం గమనార్హం.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
2023-24లో ఆహాస సబ్సిడీ కింద వాస్తవంగా ఖర్చు చేసింది రూ.2,11,814 కోట్లు కాగా, 2025-26లో కేటాయింపులు రూ.2,03,420 కోట్లకు పరిమితం చేయడం కేంద్రం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని తేటతెల్ల ం చేస్తున్నది. దీంతో ప్రజలకు సబ్సిడీపై ఇచ్చే ఆహారధాన్యాలు, నిత్యావసర సరకుల భారం ఆయా రాష్ట్రాలే భరించాల్సిన పరిస్థితి ఏర్పడిం ది. దేశంలో 19 పేద రాష్ట్రాలు మార్కెట్‌ రేటుకు కొనుగోలు చేసి ప్రజలకు సబ్సిడీపై ఇచ్చే పరిస్థితిలో లేని సమయంలో కేంద్రం అనుసరి స్తున్న ఈ వైఖరి పేదలపై పిడుగుపాటును తలపిస్తున్నది. దేశంలో ఆహార కొరతను తీర్చేందుకు కేంద్రం సరైన ప్రణాళికను కూడా ప్రకటించకపోవడం గమనార్హం. దేశంలో దాదాపు 43 కోట్ల ఎకరాల సాగుయోగ్యమైన భూమి ఉంటే, అందులో 33 కోట్ల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగవుతున్నాయి. మిగిలిన 10 కోట్ల ఎకరాల్లో పెట్టుబడి సాయం లేక, ఇతరత్రా కారణాలతో సాగు కావడం లేదు. జీ-7 దేశాలు ఇండియాను జూనియర్‌ భాగస్వామి గా చేసుకుని భారతదేశాన్ని తమ ఉత్పత్తులకు డంపింగ్‌లా మార్చుకుంటున్నాయి. మన దేశంలో ఉత్పత్తి పెరగకుండా అడ్డుకుంటున్నా యి. వాటికి తలొగ్గిన కేంద్రం దేశంలో స్వయం పోషకత్వం కోసం ఎలాంటి ప్రణాళికలు రూపొందించడం లేదనే విమర్శలూ ఉన్నాయి. వంటనూనెలు, పండ్లు, కూరగాయలు, పప్పుదినుసులదీ అదే పరిస్థితి. భారతదేశం వాటిని దిగుమతి చేసుకోవాల్సిందే. దేశంలో 2.40 లక్షల కోట్ల టన్నుల వంటనూనెలు అవసరం కాగా మన వద్ద 1.40 లక్షల కోట్ల టన్నుల ఉత్పత్తే ఉండటంతో మరో కోటి టన్నులు దిగుమతి చేసుకునేందుకు ఏడాదికి రూ.87 వేల కోట్లు ఖర్చవుతున్నది. పండ్లు, కూరగాయల దిగుమతికి కూడా ఖర్చే.
సహకరించని కేంద్రం
కేంద్రం మొదట్నుంచీ రాష్ట్రంలోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారందరికి రేషన్‌ ఇచ్చేందుకు సుముఖంగా లేదు. బీఆర్‌ఎస్‌ హయాంలో రాష్ట్రంలో 87.55 లక్షల రేషన్‌ కార్డులుండగా, అందులో 53.30 లక్షల రేషన్‌ కార్డులను మాత్రమే కేంద్రం ఆమోదించింది. దీంతో మిగిలిన 34.25 లక్షల కార్డుల ద్వారా అందించే సబ్సిడీని మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వస్తున్నది. దీంతో 34.25 లక్షల కార్డులకు సంబంధించి ఒక్కో లబ్దిదారునికి నెలకు 6 కిలోల బియ్యం, మిగిలిన 53.30 లక్షల రేషన్‌ కార్డులకు సంబంధించి ఒక్కో లబ్దిదారునికి నెలకు ఒక కిలో బియ్యం సబ్సిడీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించి గత మూణ్నెల్లుగా అందిస్తున్నది. మరో 10 లక్షల మంది రేషన్‌ కార్డుల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. వీటి పంపిణీ తర్వాత రాష్ట్రంలో రేషన్‌ కార్డుల సంఖ్య దాదాపు ఒక కోటికి చేరనున్నది. అంటే మొత్తం రేషన్‌ కార్డుల్లో సగం రేషన్‌ కార్డులకు సంబంధించిన సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. అయితే సన్న బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఆ భారాన్ని కూడా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వమే భరించాల్సి వస్తున్నది. దీంతో ఒక్కో కేజీపై అదనంగా రూ.5 భారం పడుతున్నది. 2023-24లో ఆనాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సివిల్‌ సప్లైస్‌ కోసం రూ.1,996 కోట్లు కేటాయిస్తే, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక 2025-26లో రూ.3,954 కోట్లు కేటాయించిం ది. సన్నబియ్యం పంపిణీతో పాటు భవిష్యత్తులో 14 రకాల నిత్యావసర వస్తువులను కూడా సబ్సిడీపై పంపిణీ చేయాలని యోచిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపుల్లో రూ.5,000 కోట్లపైగా వెచ్చించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కేంద్రం ఆహార సబ్సిడీ విధానాన్ని మార్చుకుని రాష్ట్రాలకు మరింత ఆర్థిక సహకారం అందిస్తే ఆయా రాష్ట్రాల్లో పేదలకు మరింత సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వీలుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -