– ఖరీఫ్ కు పప్పు,నూనె గింజల సేకరణకు ప్రణాళికలు
– రాష్ట్రంతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి అనుమతి
– ఆయా రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు, అధికారులతో చర్చల తర్వాత కేంద్రం నిర్ణయం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో పప్పు దినుసులు, సోయాబీన్ సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2025- 26 ఖరీఫ్ సీజన్ కోసం తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పప్పు ధాన్యాలు, నూనె గింజల సేకరణ ప్రణాళికను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదించారు. అందులో భాగంగా మొత్తం రూ.15,095.83 కోట్లతో ఈ నాలుగు రాష్ట్రాల నుంచి సేకరణ చేపట్టనున్నట్టు తెలిపింది. ప్రధాన మంత్రి అన్నదాత ఆరు సంరక్షణ్ అభియాన్(పీఎం-ఏఏఎస్ హెచ్ఏ), ఇతర స్కీంలతో ఈ సేకరణ అనుమతులు మంజూరు చేసినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. వర్చువల్ మోడ్లో ఆయా రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులు, సీనియర్ అధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ సేకరణ నిర్ణయంతో నాలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది రైతులకు ప్రయోజనం కలగనున్నట్టు తెలిపింది.
తెలంగాణ నుంచి సేకరించేవి…
రాష్ట్ర ప్రభుత్వంతో వివరణాత్మక చర్చల తర్వాత తెలంగాణ నుంచి పెసర, మినపప్పు, సోయాబీన్ సేకరణ ప్రణాళికకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం ఉత్పత్తిలో 25 శాతం వాటా కలిగిన 4,430 మెట్రిక్ టన్నుల పెసలు (పెసరపప్పు) సేకరించనుంది. ఇందుకోసం ప్రైజ్ సపోర్ట్ స్కీం (పీఎస్ఎస్) కింద రూ.38.44 కోట్ల వ్యయాన్ని ఆమోదించింది. అలాగే 100 శాతం మినపప్పు (మినుములు), 25 శాతం సోయాబీన్ సేకరణ చేపట్టనుంది. వీటితో పాటు మిగిలిన రాష్ట్రాల్లోనూ పప్పు, నూనె గింజలు సేకరించనుంది.
రైతుల గౌరవాన్ని కాపాడడమే అగ్ర ప్రాధాన్యత…
‘ఆత్మ నిర్భర భారత్’ నిర్మాణంలో ఈ ప్రయత్నం ఒక ముందడుగని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివారాజ్ సింగ్ అన్నారు. రైతుల ఆదాయం, గౌరవాన్ని కాపాడడమే కేంద్ర ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యత అని చెప్పారు. ఖరీఫ్ సీజన్ లో ఆయా రాష్ట్రాల్లో పప్పు ధాన్యాలు, నూనె గింజల సేకరణ వ్యవసాయ ఉత్పత్తిని పెంచుతుందన్నారు.
పప్పుదినుసులు, సోయా సేకరణకు కేంద్రం ఆమోదం
- Advertisement -
- Advertisement -



