నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మున్సిపాలిటీ 17వ వార్డులో రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఒక విషాద ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఆ వార్డు అభ్యర్థిగా ఉన్న పస్తం మల్లమ్మ ఆత్మహత్యాయత్నం చేయడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం ప్రకార.. మల్లమ్మ తన నామినేషన్ను ఉపసంహరించుకున్న నేపథ్యంలో వార్డు ప్రజల్లో కొందరు ఆమెపై డబ్బులు తీసుకుని పోటీ నుంచి తప్పుకున్నారనే ఆరోపణలు చేయడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలు ఆమెను మానసికంగా కలచివేశాయని కుటుంబసభ్యులు తెలిపారు.
ఈ నేపథ్యంలో మల్లమ్మ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించినట్టు సమాచారం. అయితే సమయానికి గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కాపాడి, ప్రమాదం నుంచి బయటపడింది. అనంతరం ఆమెకు ప్రాథమిక చికిత్స అందించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటనతో వార్డులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.అభ్యర్థులపై ఆరోపణలు చేయడంలో జాగ్రత్త వహించాలని,ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానిక పెద్దలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందిందా లేదా అన్నది స్పష్టత రాలేదు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



