– నీట మునిగిన పంట పొలాలు.. భారీగా ఇసుకమేటలు
– అప్రమత్తమైన అధికార యంత్రాంగం
– దూప్సింగ్తండా, పోచారం ప్రాజెక్టు, పునరావాస కేంద్రాలను
– సందర్శించిన సీపీఐ(ఎం) బృందం
– వరద సహాయం కింద రూ.500 కోట్లు కేటాయించాలని డిమాండ్
– వరద సహాయ చర్యల్లో ప్రభుత్వం విఫలం: హరీశ్రావు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో అత్యధికంగా వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో ఉమ్మడి మెదక్ జిల్లా ఉంది. మెదక్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురవడంతో అస్తవ్యస్థంగా మారింది. బుధ, గురు వారాల్లో కుండపోత వర్షం పడటంతో మెదక్, సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కాయి. వరదలు ఉధృతంగా ప్రవహించడంతో రహదారులు, రోడ్లు కొడ్డుకుపోయాయి. వరద నీరంతా లోతట్టు ప్రాంతాల్లో చేరడంతో పలు గ్రామాలు, పట్టణాలు జలమయమయ్యాయి. ఇండ్లు కూలిపోయాయి.
హవేళీఘన్పూర్ మండలంలో వరదల్లో చిక్కి ఇద్దరు యువకులు మృతిచెందారు. పలు చోట్ల కార్లు, ఆటోలు, వాహనాలు కొట్టుకుపోయి ప్రమాదాలు సంభవించాయి. వేల ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. గండ్లు పడ్డ చోట పొలాల్లో ఇసుక మేటలేశాయి. పశువులు, కోళ్లు, మేకలు మృత్యువాత పడ్డాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నది. రోడ్లు, రహదారులు ధ్వంసమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వరద ప్రభావిత ప్రాంతమైన హవేళీఘన్పూర్ ఏరియాలో ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. మంత్రులు వివేక్, దామోదర్, ఎమ్మెల్యేలు హరీశ్రావు, రోహిత్రావు, కలెక్టర్లు, ఎస్పీలు ప్రమాద ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రజలను ఆదుకుంటామని భరోసా కల్పించారు. సీపీఐ(ఎం) నేతలు వరదల్లో చిక్కిన కాలనీలు, ప్రజల్ని కలిశారు. సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.
గ్రామాలు, పట్టణాలు జలమయం
హవేళీఘన్పూర్ మండలంలో దూప్సింగ్ తండా పూర్తిగా నీటిలో మునిగింది. మెదక్ పట్టణంలో అనేక కాలనీల్లో నీరు చేరింది. రామాయంపేటలో ఆకుల బస్తీ, వెంకటేశ్వర, బీసీ, హమాలీ కాలనీల్లోకి నీరు చేరింది. మహిళా డిగ్రీ కళాశాల వరద నీటిలో చిక్కడంతో 300 మంది విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దొంగల ధర్మారం చెర్వు అలుగుపోయడంతో రోడ్డు దెబ్బతిని రాకపోకలాగాయి. జహీరాబాద్ పట్టంలోని అనేక కాలనీలు నీటి కుంటల్ని తలపిస్తున్నాయి.
ఇద్దరు మృతి
హవేళీఘన్పూర్ మండలంలోని రాజపేట్కు చెందిన బెస్త సత్యనారాయణ(35), దామరంచ యాదాగౌడ్ ఇద్దరు బుధవారం మెదక్లోని హాస్టల్లో పిల్లలను తీసుకొచ్చేందుకు ఆటోలో వెళ్లారు. రాజపేట్ గంగమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న విషయం గమనించకుండా వరదలో వెళ్లడంతో ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. మధ్యలో ఓ కరెంట్ స్థంభాన్ని ఎక్కి నాలుగు గంటల పాటు ప్రాణాల్ని రక్షించుకోగలిగారు. అయితే వరద పెరగడంతో ఆ స్థంభం కూడా కూలిపోవడంతో యువకులు కొట్టుకుపోయారు. అందులో సత్యనారాయణ శవం లభించగా.. యాదాగౌడ్ ఆచూకీ దొరకలేదు. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో 500 ఇండ్ల వరకు కూలడం, దెబ్బతినడం వల్ల అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. మెదక్ జిల్లాలో రెండు పునరావాస కేంద్రాల్లో దూప్సింగ్ తండా ప్రజలు తలదాచుకుంటున్నారు.
ధ్వంసమైన రోడ్డు, తెగిన రహదారులు
మెదక్ నుంచి పాపన్నపేట, టేక్మాల్, పెద్ద శంకరంపేట, అల్లాదుర్గం మండలాలకు వెళ్లే రోడ్డులో ఎల్లాపూర్ బ్రిడ్జీ వద్ద సింగూర్ వరద నీరు ప్రవహించి రోడ్డు కొట్టుకుపోయింది. నాలుగు మండలాల్లోని గ్రామాల ప్రజలకు జిల్లా కేంద్రానికి రాకపోకలు ఆగిపోయాయి. మెదక్ నుంచి హవేళీఘన్పూర్ మండలంలోని 40 గ్రామాలను కలిపే రూట్లో బూరుగుపల్లి వద్ద వరద ఉధృతికి రోడ్డు కొట్టుకుపోయింది. మరో రూట్లో కూడా రోడ్డు కొట్టుకుపోవడంతో 40 గ్రామాల ప్రజలు కదల్లేని పరిస్థితి. గురువారం ఓ గర్భిణి పురిటినొప్పులతో బాధ పడుతుండగా ప్రత్యేక బలగాలు సురక్షితంగా ఆస్పత్రికి తరలించాయి. హైదరాబాద్-మెదక్-బోధన్ వెళ్లే రహదారి 765డీ పోచారం డ్యామ్ వద్ద పూర్తిగా కొట్టుకుపోయింది. హవేళీఘన్పూర్ మండలంలో అత్యధికంగా 261.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
రూ.500 కోట్ల నిధిలిచ్చి ఆదుకోవాలి: సీపీఐ(ఎం)
వరదల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినందున మెదక్ జిల్లాకు వెంటనే రూ.500 కోట్ల నిధుల్ని తక్షణ సహాయం కింద విడుదల చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. జిల్లా కార్యదర్శి కడారి నర్సమ్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.అడివయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.మల్లేశం, కె.మల్లేశంతోపాటు నాయకులు దూప్సింగ్ తండా, పోచారం డ్యామ్, పునరావాస కేంద్రాలను సందర్శించారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు తక్షణ సహాయం చేయాలన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే..: హరీశ్రావు, మాజీ మంత్రి
రాజపేట్కు చెందిన ఇద్దరు యువకులు వరదల్లో చిక్కిన సమయంలో కాపాడేందుకు ప్రభుత్వం హెలిక్యాప్టర్ పంపకపోవడం వల్లే వారు చనిపోయారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మంత్రులు తమ సొంత పనులకు హెలిక్యాప్టర్లను వాడుకుంటారు తప్ప ప్రజల ప్రాణాల్ని కాపాడేందుకు మాత్రం అనుమతుల్లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.న
మెదక్, సిద్దిపేట జిల్లాల్లో అస్తవ్యస్తం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES