– రెండు నెలల క్రితం ఒకరు.. నేడు మరొకరు..
– ధారూర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు
నవతెలంగాణ-ధారూర్
కోడి కోసం కోట్లాడిన గొడవలో రెండు నెలల క్రితం ఇద్దరి మధ్య గొడవలో ఒకరు హత్య కాగా, కోపం పెంచుకున్న మృతుని కుమారుడు బుధవారం తన తండ్రిని చంపాడన్న కోపంతో హత్య చేశాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం రాంపూర్ తండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంపూర్ తండాలో రెండు నెలల క్రితం మోహన్ అనే వ్యక్తి తన కోడిని ఎందుకు చంపావని అదే గ్రామానికి చెందిన శంకర్తో గొడవపడ్డాడు. ఈ ఘర్షణలో మోహన్కు తీవ్ర గాయాలవ్వగా.. గ్రామస్తులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. మోహన్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో శంకర్, అతని భార్య లక్ష్మీ బారు, కుమారుడు రాజేశ్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మోహన్ మృతి చెందాడు. దాంతో మోహన్ కుమారుడు సాయి కుమార్.. శంకర్ కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. ఇటీవలే శంకర్ బెయిల్పై విడుదలై తాండూర్లోని అంతరం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. బుధవారం శంకర్ పింఛన్ కోసం ధారూర్ మండల కేంద్రానికి వచ్చాడు. పింఛన్ తీసుకున్న అనంతరం బస్టాండ్ సమీపంలో ఉన్న అతనిపై సాయికుమార్ దాడి చేయడంతో శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, సీఐ రఘురాం సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు సాయికుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కోడి గొడవ.. వ్యక్తి దారుణ హత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



