నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఒక కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపికను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు తెలంగాణకు 22 మంది పరిశీలకులను నియమించింది. ఒత్తిళ్లకు తావులేకుండా నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఏఐసీసీ సీనియర్ నాయకులను ఇన్ఛార్జిలుగా నియమించింది.
ఈ నెలాఖరు వరకు డీసీసీ అధ్యక్షులను నియమించనున్నారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఆయా జిల్లాల్లో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. కాగా, ముఖ్యమంత్రి రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.



