Monday, September 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసౌర విద్యుత్‌ గ్రామంగా ముఖ్యమంత్రి స్వగ్రామం కొండారెడ్డిపల్లి

సౌర విద్యుత్‌ గ్రామంగా ముఖ్యమంత్రి స్వగ్రామం కొండారెడ్డిపల్లి

- Advertisement -

– దేశంలో రెండోది, దక్షిణ భారత దేశంలో మొదటి గ్రామం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

సంపూర్ణ సౌర విద్యుత్‌ గ్రామంగా ముఖ్యమంత్రి ఎ రేవంత్‌ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి గుర్తింపు పొందనుంది. నాగర్‌ కర్నూల్‌ జిల్లా వంగూర్‌ మండలంలో అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో కొండారెడ్డిపల్లి గ్రామం ఉంది. దేశంలో రెండో సౌర విద్యుత్‌ గ్రామంగా, దక్షిణ భారతదేశంలో మొదటి గ్రామంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. టీజీఆర్‌ఈడీసీఓ ద్వారా రూ 10.53 కోట్లతో 514 ఇండ్లతో , పాటు 11 ప్రభుత్వ భవనాలకు సౌర విద్యుత్‌ ప్రాజెక్టును ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రతి ఇంటికి 3 కేడబ్ల్యూ స్థాపిత సామర్ధ్యంతో 480 ఇండ్లకు సౌర విద్యుత్‌ వసతిని కల్పించారు. అలాగే 60 కేడబ్ల్యూ సామర్ధ్యం కలిగిన 11 ప్రభుత్వ భవనాలకు సౌర విద్యుత్‌ పరికరాలు బిగించారు. మొత్తం సౌర విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం 1,500 కేడబ్ల్యూ ఉన్నది. మట్టి గోడలతో ఉన్న 34 ఇండ్ల కుటుంబాలు కూడా సౌర విద్యుత్‌ పరికరాలు ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయి.

ఈ కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయిన వెంటనే, వాటిపై కూడా సౌర విద్యుత్‌ పరికరాలు బిగించనున్నట్టు ఆర్‌ఈడీసీఓ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మేనేజర్‌ కె. మనోహర్‌ రెడ్డి తెలిపారు. కొండారెడ్డిపల్లి గ్రామం సౌర విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 10.53 కోట్లు . అందులో రూ.7.96 కోట్ల వ్యయంతో సౌర విద్యుత్‌ పరికరాలు ఏర్పాటుకు కేటాయించారు. సౌర విద్యుత్‌కు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.3.56 కోట్లు , ప్రెమియర్‌ ఇంజనీర్స్‌ కంపెనీ నుండి కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) నిధుల నుండి రూ 4.092 కోట్లు భరించారు. మరో రూ 2.59 కోట్లను మౌలిక వసతుల అభివృద్ధికి ఖర్చు చేశారు. ప్రతి ఇంటి నుండి నెలకు 360 యూనిట్స్‌ విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది.(ప్రతి కేడబ్ల్యూకు 120 యూనిట్స్‌ అవుతుంది) ఇండ్ల నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను, ఇంటి వినియోగానికి పోగా, మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. గ్రిడ్‌కు పంపే విద్యుత్‌ యూనిట్‌కు రూ 5.25 చొప్పున చెల్లించుటకు లబ్దిదారులతో విద్యుత్‌ పంపిణీ సంస్థ ఒప్పందం చేసుకున్నది. సెప్టెంబర్‌ నెలలో విద్యుత్‌ గ్రిడ్‌కు గ్రామం మొత్తం నుండి సుమారు ఒక లక్ష యూనిట్స్‌ విద్యుత్‌ ఎగుమతి అయింది. తద్వారా రూ 5 లక్షలు ఆదాయాన్ని గ్రామస్తులు ఒక నెలలోనే ఆర్జించారని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -