Friday, May 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంచిన్నారుల అక్రమ రవాణా ముఠా అరెస్ట్‌

చిన్నారుల అక్రమ రవాణా ముఠా అరెస్ట్‌

- Advertisement -

– పోలీసుల అదుపులో 13 మంది
– వారి చెరలో 28 మంది పిల్లలు
– 10 మందిని రక్షించిన పోలీసులు
– నల్లగొండలోని బాలల సంక్షేమ కేంద్రానికి అప్పగింత
– మిగతా వారి కోసం గాలింపు
– ఎస్పీ నర్సింహ వెల్లడి
నవతెలంగాణ-సూర్యాపేట

తల్లిదండ్రుల వేదనను వ్యాపారంగా మార్చి, చిన్నారుల జీవితాలతో చెలగాటమాడుతున్న ముఠాను సూర్యాపేట పోలీసులు పట్టుకున్నారు. చిన్నారులను అక్రమంగా రవాణా చేసి, విక్రయిస్తున్న ఈ అక్రమ దత్తత ముఠాను పోలీసులు గుర్తించి బుధవారం 13 మందిని అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యులు 28 మంది చిన్నారులను అక్రమంగా రవాణా చేసినట్టు దర్యాప్తులో తేలింది. 10మంది చిన్నారులను పోలీసులు రక్షించి, నల్లగొండలోని బాలల సంక్షేమ కేంద్రానికి అప్పగించారు. ఈ చిన్నారుల్లో ఏడుగురు బాలురు, ముగ్గురు బాలికలు ఉన్నారు. నిందితుల నుంచి 13 మొబైల్‌ ఫోన్లు, మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా చిన్నారుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి పలు వివరాలను ఎస్పీ నరసింహా జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మీడియా సమావేశంలో వెల్లడించారు. సూర్యాపేటలోని చంద్రన్న కుంట ఎంఎస్‌.రెడ్డి స్కూల్‌ వద్ద నివసిస్తున్న నక్క యాదగిరి-ఉమారాణి దంపతులు ఆటోలో గుడ్లు అమ్ముతూ, పిల్లలు లేని తల్లిదండ్రుల గురించి సమాచారం సేకరించేవారు. మగ శిశువు, ఆడ శిశువు కోసం ప్రత్యేకంగా రేట్లు నిర్ణయించి రూ.10 వేల నుంచి 2 లక్షల వరకు బేరం చేసేవారు. ఇతర ప్రాంతాల నుంచి పిల్లలను తీసుకొచ్చి అవసరమైన దంపతులకు విక్రయించేవారు. పిల్లలు లేని వారి బలహీనతను ఆసరాగా చేసుకుని చిన్నారుల జీవితాలతో అక్రమ దత్తత ముఠా చెలగాటం ఆడింది. టేకుమట్లలో అక్రమ దత్తత వ్యవహారంపై వచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు విశ్వసనీయ సమాచారం ఆధారంగా బుధవారం ఉదయం యాదగిరి, ఉమారాణిని అరెస్టు చేశారు. మిగతా నిందితులు సూర్యాపేట హైటెక్‌ బస్టాండ్‌ వద్ద సమావేశమయ్యారన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులలో నక్కా యాదగిరి, నక్కా ఉమారాణి దంపతులతోపాటు విజయవాడకు చెందిన కోరే నాగేంద్రకుమార్‌(ప్లంబర్‌), కోటె రామలక్ష్మి (నర్స్‌), పిళ్ల పవనీ (వ్యాపారి), గరికముక్క విజయలక్ష్మి (గృహిణి), అముదాలపల్లి సత్యమణి (గృహిణి), హైదరాబాద్‌/నాగర్‌కర్నూల్‌కు చెందిన ముదావత్‌ రాజు(డ్రైవర్‌), హైదరాబాద్‌కు చెందిన నర్స్‌ ఇథా శోభారాణి, సబవత్‌ శ్రీనివాస్‌ (డ్రైవర్‌), ఎర్పుల సునీత, సిస్టర్‌, రాజస్థాన్‌లోని ఖాన్‌ షహీనా, తిరుమలగిరికి చెందిన షహానాను అరెస్టు చేశారు. వీరి నుంచి సమాచారం సేకరించి టేకుమ ట్లలో ఇద్దరు బాలురు, సూర్యాపేట పట్టణంలో ఇద్దరు బాలికలు, పెన్‌పహాడ్‌లో బాలుడు, ఉప్పలపహాడ్‌లో ఇద్దరు బాలురు, చిన్న సూరారం (నల్లగొండ)లో బాలిక, హైదరాబాద్‌లో బాలున్ని రక్షించారు. నిందితుల నుంచి ట్రాలీ ఆటో, స్విఫ్ట్‌ డిజైర్‌ కారు, హోండా మొబిలియో ఎస్‌ కారు, మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా కార్యకలాపాలు మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లోనూ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరిలో కొందరిపై మునగాల, జనగామ, ఎలూరు, మంగళగిరి, మెడిపల్లి, ముంబై పోలీస్‌ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నిందితులను సూర్యాపేట జిల్లా జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. ఈ సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్‌, సీఐరాజశేఖర్‌, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగభూషణరావు, ఎస్‌ఐలు బాలునాయక్‌, గోపికృష్ణ, సీసీఎస్‌ సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -