Sunday, June 8, 2025
E-PAPER
Homeకవర్ స్టోరీబడితోటలోనే బాల్యం విరబూయాలి

బడితోటలోనే బాల్యం విరబూయాలి

- Advertisement -

పద్దెనిమిది ఏండ్ల లోపు బడి బయట ఉన్నవారంతా బాల కార్మికులే. ఒక సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా మూడోవంతు బాలలు బడి ముఖం చూడనివారు. లేదా మధ్యలో బడిమానేసినవారు వున్నారు. అంటే డ్రాపవుట్స్‌ అన్నమాట. వివిధ కారణాల రీత్యా ఈ డ్రాపవుట్స్‌ సంఖ్య నానాటికీ పెరగడం విషాదమే. మన తెలంగాణాలో కూడా దాదాపు అదే నిష్పత్తి కొనసాగుతూ వుండవచ్చు.
(జూన్‌ 12 బడులు తెరుస్తున్నారు. అదే రోజు అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా)


గత ఏడాది తెలంగాణాలో బడిబాట పట్టినవారు 19.5 లక్షల మంది. కార్పొరేట్‌ లేదా ప్రైవేటు బడుల్లో చదువుతున్నవారు 12 లక్షల మంది. వెరసి 31.5 లక్షలమంది. కాగా సుమారు మరో 10 లక్షలమంది బాలలు మన రాష్ట్రంలో బడి బయటే వుంటున్నట్టు విద్యావేత్తల అంచనా.
మరి ఈ బాలకార్మికుల బాధ్యత ఎవరిది?
ప్రభుత్వానిది. అంటే విద్యావ్యవస్థది. బాలల హక్కులు, సంక్షేమ విభాగాలది. ఆ తర్వాత సమాజానిది. అంటే ఉపాధ్యాయ రంగానిది. తల్లిదండ్రులది.
ప్రైవేటు బడుల యాజమాన్యాలవారు వారి పాఠశాలలకు వచ్చే విద్యార్థులకే బాధ్యత వహిస్తారు. ప్రభుత్వం సర్కారు బడుల పిల్లలకు మాత్రమే ప్రధానంగా బాధ్యత తీసుకుంటుంది. మరి ఈ నేపధ్యంలో బాలకార్మికులకు దిక్కెవరు?
నిర్భంద ఉచిత విద్య, విద్యాహక్కు చట్టం, బాలల హక్కులు ఇలాంటివన్నీ కాగితాలకే పరిమితమేనా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే దాదాపు అవును అనే సమాధానమే వస్తుంది.
సాధారణంగా పాఠశాలలో చేరి చదువుకోవాల్సిన వయసు సామర్ధ్యానికి ఆటంకం కల్గించడం, మానసికంగా, శారీరకంగా, నైతికంగా దెబ్బతీసే రీతిలో పనులు చేయించడం, ఆ పనుల ద్వారా పిల్లల శ్రమను దోపిడీ చేయడాన్ని బాలకార్మిక వ్యవస్థగా పేర్కొంటారు.
పిల్లల సమగ్ర వికాసానికి, సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేదే నిజమైన సుపరిపాలన. ఎందుకంటే పిల్లల భవిష్యత్తే మన దేశ భవిష్యత్‌. రాష్ట్ర భవిష్యత్‌ కూడా. ఆ భవిష్యత్తుకు చక్కటి బాటలు పరవకుండా, పటిష్ట పునాదులు వేయకుండా ఎంత అభివృద్ధి సాధించినా ఆ వ్వవస్థలు స్వీయ విధ్వంసానికి దారి తీయవచ్చు. ఇప్పుడు చాలాచోట్ల జరుగుతున్నదదే. ‘నిరుద్యోగమూ, నిరాశా నేడు అణువణువున సమాజాన్ని ఆవరించెరా’ అన్న కవి వాక్కు ఇప్పటికీ అతిశయోక్తి కాదు కదా.
దేశహితం కోరే సంస్కారవంతమైన విద్యను అభ్యసించేవారే ఉత్తమ పౌరులై జాతి నిర్మాణంలో పాలు పంచుకోగలరు. లేనిపక్షంలో మనకు మనమే వారిని మన విద్యావిధానం పద్ధతుల ద్వారా కేవలం కెరీర్‌కే పరిమితమైన స్వార్థ జీవులగానో, ఏ దిక్కూ తోచని అసాంఘీక శక్తులగానో తయారవడానికి పరోక్షంగా కారకులమవుతాం. నిశితంగా పరిశీలించవలసిన సమయం వచ్చింది మరి. పరిస్థితులు ఆ విధంగా తోసుకొస్తున్నాయి కూడా.
స్వాతంత్య్రం వచ్చి 77 ఏండ్లు పూర్తయినా మనకు కామన్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పద్ధతి లేదు. ధనిక – బీద, వర్ణ, మత బేధ తారతమ్యాలు లేని అందరూ కలిసి చిన్నప్పటి నుండి సమానంగా, హాయిగా చక్కగా చదువుకునే పద్ధతి దిశగా కనీసం మన పాలకుల ఆలోచన సాగడం లేదు. పేరుకు మాత్రం మనది ప్రజాస్వామ్య దేశం అని గొప్పలు చెప్పుకుంటాం. చిన్నప్పటి నుండి పసిహృదయాల్లో అంతరాలు ఏర్పడితే అవి పెరిగి పెరిగి ద్వేషభావాలు ఏర్పడడానికి దారితీస్తాయని మానసిక నిపుణులు చెపుతున్నారు. ఒకపక్క బాలకార్మిక వ్యవస్థతోనూ, మరోపక్క రానురాను అంతరాలు పెరుగుతున్న విద్యా వ్యవస్థతోనూ సాగడం ఏ దేశానికీ, రాష్ట్రానికీ క్షేమకరం కాదు. ఇలా రెండువైపులా బాల్యం చిధ్రమైపోతున్న విషయం పాలకుల సోయికి రాకపోవడం అతిపెద్ద విషాదం కాదా?
బాలకార్మికుల్లో ప్రమాదకర పనుల్లో పని చేసేవారు కూడా గణనీయ సంఖ్యలో వున్నారు. కణకణమండే ఇటుక బట్టీల్లోనూ భారమైన నాపరాయి, సున్నపురాయి, బాక్సైట్‌ గనుల్లోనూ, అధికమందులు వెదజల్లే పత్తివిత్తన క్షేత్రాల్లోనూ, రసాయనాలు వాడే పురుగుమందులు, ఎరువులు, అగిపెట్ట, బాణాసంచా ఫ్యాక్టరీల్లోనూ, మరమరాలు, పేలాలు చేసే పొగచూరే పొయ్యిల వద్దనూ, హోటల్‌ కార్మికులుగానూ… ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పని ప్రదేశాలు కన్పిస్తాయి. ఇక ఏ దిక్కూ మొక్కూ లేని వీధిబాలలు సరేసరి. రైళ్లల్లో, ప్లాట్‌ఫారాలపై, బస్టాండ్‌లలోనూ యాచన చేసేవారు, ట్రాఫికింగ్‌ (అక్రమరవాణా)కు గురయ్యేవారు, చట్ట వ్యతిరేక చీకటి కార్యక్రమాలు గంజాయి, డ్రగ్స్‌, లిక్కర్‌ అమ్మకం, చేరవేత కార్యకలాపాల్లో… ఇలా ఎందరో. వీరి బాల్యం బతుకు దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు. నరకం కన్నా ఘోరం.
కొద్దో గొప్పో మంచి మనసున్న అధికారులున్నచోట, లేదా నిజాయితీగా పనిచేసే కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా, వ్యక్తుల ద్వారా, ఇలాంటి అధోగతి బాలలకు కొద్దో గొప్పో కొంత ఉపశమనం లభిస్తుంది. లేకుంటే వారి జీవితాలు తెగిన గాలిపటాలే కదా? అటు రాజ్యమూ, ఇటు పౌర సమాజమూ పట్టించుకోక పోతే ఆ బాలల పరిస్థితి ఏమిటి? ఎవరు జవాబు దారీ?
సమూలంగా బాలకార్మిక వ్యవస్థను కూకటి వేళ్లతో సహా పెకిలించాలంటే పాలకులకు చిత్తశుద్ధి వుండాలి. బలమైన రాజకీయ సంకల్పం లేకుండా బాలకార్మిక వ్వవస్థ నిర్మూలన జరగదు. ఎందుకంటే బాలకార్మిక వ్యవస్థ పేదరికంతో ముడిపడి వుంటుంది. బాలలను ప్రాతిపదికగా చేసుకుని పేదరిక నిర్మూలనకు శాస్త్రీయ ప్రణాళికలు దూరదృష్టితో రచించి అమలు పరచాలి. అప్పుడు అటు బాలకార్మిక వ్వవస్థ, పేదరికం క్రమేణా తగ్గడంతో పాటు బాలల అభివృద్ధి స్థూలంగా మెరుగవడానికి సమాంతరంగా తోడ్పడుతుంది. ప్రస్తుతం నెలకొని వున్న కార్పొరేట్‌ పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇలా ఆలోచించడం దురాశేమో!
ఈ నేపధ్యంలో ఇటీవల హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సర్కారు బడులు – పాఠశాల విద్య – విద్యార్థుల అభివృద్ధి అంశంపై తెలంగాణా పీపుల్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటి (టి.పి.జె.ఎ.సి) ఆధ్వర్యంలో ఒక రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. విద్యావేత్తలు, వివిధ రంగాల్లో పనిచేసే ప్రముఖులు ఎందరో పాల్గొని చాలా విలువైన సూచనలు చేశారు. పలు తీర్మానాలు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు.
సరిపోను సంఖ్య లేదనే కారణాన గతేడాది సర్కారు బడులు 1789 మూతబడ్డాయని పేర్కొన్నారు. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు కూడా. కాగా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యాకమిషన్‌ సిఫారసులు ఒకసారి పరిశీలిద్దాం.
ప్రతి మండలంలో ఎంపిక చేసిన మూడు ఉన్నత పాఠశాలల్లో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేయాలి. ఇందులో విద్యార్థుల సంఖ్య 1500 – 1800 వరకూ వుండాలి. ఒక్కో స్కూల్‌కు 4,5 ఎకరాల స్థలం అవసరం.
అలాగే ప్రతి మండలంలో నాలుగు తెలంగాణా ఫౌండేషన్‌ స్కూల్స్‌ (టి.ఎఫ్‌.ఎస్‌) ఏర్పాటు చేయాలి. ఇందులో నర్సరీ నుండి ఎల్‌.కె.జి, యు.కె.జి., 1,2 తరగతుల వరకూ వుండాలి. ఇందుకు కనీసం ఎకరంన్నర స్థలం వుండాలి. ఒక్కో పాఠశాల వసతుల ఏర్పాటుకై మూడున్నర కోట్లు అవసరం. అంటే రాబోయే ఐదేండ్లలో రాష్ట్రంలో 632 మండలాల్లో ఈ పబ్లిక్‌ స్కూళ్లకు, ఫౌండేషన్‌ స్కూళ్లకు అయ్య ఖర్చు 31,600 కోట్లు అన్నమాట.
మరి ప్రతి మండలానికి ఇలా ఏడు పాఠశాలలే వుంటే, తక్కిన పాఠశాల పరిస్థితి ఏమిటి? 2010 విద్యాహక్కు చట్టం కల్పించే హక్కు అందరికీ విద్యనందించడం సాధ్యమవుతుందా? ఆలోచించాలి.
ఇదిలా వుండగా విద్యార్థుల అభ్యసన ఫలితాలు తీవ్రాందోళన కలిగిస్తున్నాయి. అసర్‌ వార్షిక విద్యాస్థితి నివేదిక ఇదే తెలియజేస్తున్నది. రెండవ తరగతి స్థాయి వచనాన్ని చదవగలిగే ఎనిమిదవ తరగతి విద్యార్థుల శాతం అంతకు ముందు 61.8 శాతం వుంటే గత ఏడాది అది 56.4 శాతానికి తగ్గింది. అలాగే గణితంలో 44.6 శాతం నుండి 41.1 శాతానికి పడిపోయింది. ఇంకో ముఖ్యవిషయం 6 నుండి 8 తరగతుల విద్యార్థులు కేవలం 46.4 శాతం మంది మాత్రమే 2వ తరగతి స్థాయి వచనాన్ని చదవగలుగుతున్నారు. 34.7 శాతం మంది మాత్రమే లెక్కలు చేయగలుగుతున్నారు.
ఒక పక్క ఉత్తీర్ణతలో 600 కు 600, 599, 598, 597…. ఇలా కొంతమందికి ర్యాంకులు రావడం ఏమిటి? మరోపక్క ఇలా చాలామందికి తీవ్ర సంక్షోభం ఏర్పడడం ఏమిటి?
పునాది విద్య, గణితం, (ఎఫ్‌.ఎల్‌.ఎన్‌ – ఫౌండేషన్‌ లిటరసీ న్యూమరసీ) గణితం లేకుండా విద్యార్థి జీవితంలో ఎదగడం సాధ్యమవుతుందా? తన మనసులో అనుకున్నది, చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పలేకున్నప్పుడు, తప్పులు లేకుండా రాయలేనప్పుడు ఇంక ఆ చదువుకు అర్థం ఏముంటుంది? ఎన్ని ర్యాంకులు వచ్చినా అవి డొల్ల ర్యాంకులు కాదా? ఇలా ఎన్నో సమస్యలు ఆ సమావేశంలో వ్యక్తమయినాయి. ఉన్నంతలో మెరుగైన విద్యాపద్ధతులు పాటించేందుకు సర్కారుపై ఒత్తిడి చేసేలా ఉద్యమం సాగించాలని ఆ సమావేశం భావించింది.

– కె.శాంతారావు, 9959745723

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -