డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఆమెరికా ఆర్థిక కష్టాలు అధికమయ్యాయి. అంటే అంతకుముందు అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా గొప్పగా ఉందనేదేం కాదుగానీ, నయా ఉదారవాదం, ప్రపంచీకరణ అమలులో ఎదురౌతున్న ఆటంకాల వల్ల అప్పటికే కష్టాల్లో ఉన్న అమెరికా.. ట్రంప్ మహాశయుడు అమలుచేస్తున్న అతితెలివి నిర్ణయాలతో ముఖ్యంగా ప్రపంచ దేశాలతో సాగిస్తున్న వాణిజ్య యుద్ధమూ, ముఖ్యంగా చైనాను కట్టడి చేయడానికి చేస్తున్న ప్రయత్నాల వల్ల ఆ రెండు దేశాల ఆర్ధిక వ్యవస్థలతో పాటు మొత్తం ప్రపంచ ఆర్థిక గమనమే ఒడిదుడుకులకు లోనవుతున్న ప్రమాదం మన కళ్ల ముందు కదలాడుతున్నది.
ఏప్రిల్ 2న దాదాపు 150కి పైగా దేశాల పైన భారీగా ‘సుంకాలు’ విధిస్తూ ట్రంప్ ఒక ప్రకటన చేసాడు. ఈ సుంకాలు కనీసంగా ఇండియా పై 27% ఉండగా, అత్యధికంగా చైనాపై 54% విధించారు. అంతేగాక అమెరికా ఎగుమతి చేస్తున్న సరుకులపైన ఆయా దేశాలు విధిస్తున్న సుంకాలు తగ్గించాలి లేదా ఎత్తివేయాలని అన్ని దేశాలకూ ఆయన ‘హుకుం’ కూడా జారీ చేశాడు. ఇందుకు 1. అమెరికా నుండి తరలిపోయిన పరిశ్రమలను తిరిగి అమెరికాకు రప్పించాలని 2. 36లక్షల కోట్లుగా ఉన్న అమెరికా భారీ అప్పును అదుపుజేయటానికి ఎగుమతి-దిగుమతుల్లో లోటును పూడ్చటానికి 3. ప్రపంచ కరెన్సీగా ఉన్న అమెరికా డాలర్ అధిపత్యానికి ఏర్పడుతున్న ముప్పు తప్పించటానికి – అనే మూడు కారణాలు చెప్పారు. ఈ లక్ష్యాల సాధనకు సుంకాలు విధిస్తున్న రోజుగాబట్టి దానిని (ఏప్రిల్-2ని) ఆయన ‘లిబరేషన్ డే’ అని ప్రకటించాడు. ఈ కారణాలు, లక్ష్యాలు నిజమైనవేనా? సుంకాల ద్వారా ఈ లక్ష్యాలు నెరవేరతాయా? ఇది అమెరికాకు లిబరేషన్ డే నా? లేక డూమ్స్ డే నా? అనేది తర్వాత చర్చిద్దాం. ముందుగా ఈ సుంకాల పట్ల ప్రపంచం ఎలా స్పందించింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలేమిటీ అనేది మొదటగా తెలుసుకుందాం.
తాను సుంకాల విధింపు ప్రకటించిన రెండ్రోజుల తర్వాత ప్రెస్ మీట్లో ‘మీ సుంకాల పట్ల స్పందన ఎలా ఉంది? అని ప్రశ్నిస్తే – ‘అద్బుతంగా ఉంది. దేశ, దేశాలన్నీ నాతో మాట్లాడ టానికి ఒప్పందాలు కుదుర్చుకోవటానికి పోటీలుపడి ముందుకు వస్తున్నాయి. సార్! సార్!! మీరు చెప్పినట్లు వింటాం సార్! మీతో చర్చించటానికి అవకాశం ఇవ్వండి సార్! ప్లీజ్ సార్ మీరు ఏం చెప్పినా వింటాం సార్!! అని వివిధ దేశాల నేతలు ఎగబడుతున్నారు” అంటూ ట్రంప్ నోరు పారేసుకున్నారు. ఆయన భాషకు అంతర్జాతీయ మీడియా అంతా ఆశ్చర్యపో యింది. తప్పుబడుతూ కథనాలు ప్రచురించింది. వాస్తవంగా ఒక్క ఇండియా తప్ప మిగతా అన్ని దేశాలూ ఈ సుంకాల విధింపును వ్యతిరేకిస్తూ వైఖరి తీసుకున్నాయి తప్ప బెదిరి పోలేదు. లొంగిపోవటానికి సిద్ధపడలేదు. ఇండియా మాత్రం వీటిని ఖండించకపోగా అమెరికా ‘ఆజ్ఞల’ ప్రకారం అంతకు ముందు అమెరికా సరుకులపై (హార్డ్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్లు, కొన్ని విస్కీ బ్రాండ్లు వగైరా) అమలులో ఉన్న కొన్ని సుంకాలు వెంటనే తగ్గిస్తూ ప్రకటనలు చేసింది. ఇక ఈ సుంకాలను వ్యతిరేకంచిన మిగతా దేశాలకు సంబంధించి మరో విశేషం ఉంది. ఒక్క దేశం తప్ప మిగతావన్నీ సుంకాలను వ్యతిరేకిస్తూనే అమెరికాతో చర్చలకు సిద్దమనే వైఖరిని తీసుకున్నాయి. ఏకపక్షంగా విధించిన సుంకాలను రద్దు చేసేదాకా చర్చల ప్రసక్తే లేదని చెప్పటంతోపాటు ‘మా సరుకులపై సుంకాలు వేస్తే మేం కూడా వేస్తాం’అని చెప్పి అమెరికా సరుకులపైన సుంకాలు ప్రకటించిన ఏకైక దేశం చైనా. దీంతో ట్రంప్కు చిర్రెత్తుకొచ్చింది. అలా ధిక్కరించినందుకు చైనాపై సుంకాలను 84 నుంచి 145 శాతానికి పెంచారు. చైనా కూడా దానికి ప్రతిగా 125 శాతానికి సుంకాలు పెంచింది.
ఈ పరంపరలో ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలయ్యాయి. అన్ని స్టాక్మార్కెట్లూ కుప్పకూలాయి. దాదాపు 20లక్షల కోట్ల డాలర్లకు పైగా సంపదను ఒకటి, రెండు రోజుల్లోనే ఏప్రిల్ మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా మదుపర్లు నష్టపోయారు. దాంతోపాటు అమెరికా బాండ్ మార్కెట్ కుప్పకూలే భయంకర ప్రమాదం ట్రంప్ యంత్రాంగం ఎదుట సాక్షాత్కరించింది. అమెరికా తన బడ్జెట్ లోటును పూడ్చుకునేందుకు ఇష్టారాజ్యంగా ప్రింట్ చేయటానికి నిబంధనలు అంగీకరించవు కాబట్టి డాలర్లను అప్పుగా సేకరించటానికి ప్రభుత్వ ష్యూరిటీగా బాండ్లను అమ్ముతుంది. ఉత్పత్తిలో ఆధిపత్యం, వినిమయంలో పొదుపు ఉన్న దేశాలకు ప్రపంచ వాణిజ్యంలో డాలర్ల రూపంలో మిగులు ఏర్పడుతుంది. అలా మిగిలిన డాలర్లతో అమెరికా బాండ్లను కొని ఆ దేశాలు అమెరికాకు అప్పు సమకూరుస్తుంటాయి. ఇపుడు అమెరికాను వేధిస్తున్న 36లక్షల కోట్ల డాలర్ల అప్పు ఆ రూపంలో సేకరించిందే. దానికి ఏటేటే వేలకోట్ల డాలర్ల వడ్డీలు, వాయిదాలు అమెరికా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అమెరికాకు అప్పు పెట్టిన దేశాలలో చైనా, జపాన్ అగ్రస్థానంలో ఉన్నాయి. అమెరికా అస్తవ్యస్త ఆర్ధిక విధానాల వల్ల ఆయా దేశాలు ఇటీవల క్రమంగా అమెరికా బాండ్లను తగ్గించుకుంటున్నాయి. ఉదాహరణకు గతంలో ఒక ట్రిలియన్ డాలర్లకు పైగా అమెరికా బాండ్ల నిల్వలున్న చైనా ప్రస్తుతానికి 700 బిలియన్ డాలర్లు లోపుకు తగ్గించింది. ట్రంప్ సుంకాల విధింపువల్ల ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఏర్పడిన అనిశ్చితి చూసి ఈ బాండ్లను ఇంకా తగ్గించుకునే ప్రయత్నాలతో బాండ్ల విలువ మార్కెట్లో పడిపోవటం ప్రారంభమైంది. దాంతో వాటికిచ్చే వడ్డీ రేట్లు పెరగాల్సి వస్తుంది. అమెరికా అప్పు భారం పెరుగుతుంది. ఈ పరిణామాలు, అంతరంగికుల హెచ్చరికలతో ట్రంప్ మహాశయుడికి తత్వం బోధపడింది. వెంటనే ఏప్రిల్ 10న సుంకాల అమలును 3మాసాలు వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించాల్సి వచ్చింది. ఆ ప్రకటనలో అసలు కారణాలు దాచిపెట్టి ముఖబిర్రుతో ‘చాలా దేశాలు చర్చలకు వస్తున్నాయనీ, వారందరితో చర్చలు జరిపి ఒప్పందాలు కుదుర్చుకోవాలంటే సమయం అవసరం కాబట్టి సుంకాల అమలు వాయిదా వేస్తున్నామనీ’ ప్రకటించాడు.
ఆ మూడు నెలల గడువులో ఇప్పటికే రెండు మాసాలు గడిచిపోయాయి. అయినా ఇప్పటివరకూ బ్రిటన్తో తప్ప ఏ ఒక్క దేశంతోనూ ట్రంప్ ఒప్పందాలు కుదుర్చుకోలేకపోయాడు. ప్రధానంగా చైనా టారిప్ల దెబ్బకు వెంటనే దిగివస్తుందని నమ్మిన ట్రంప్కు తీవ్ర ఆశాభంగం కలుగుతోంది. ”చైనా చర్చలకు వస్తోందనీ, తనతో మాట్లాడుతున్నారనీ, ఈ రోజు ఉదయమే ఫోన్ కాల్ వచ్చిందనీ” ఇలా అనేక మార్లు ప్రెస్ వాళ్లతో ట్రంప్ అబద్దాలు చెప్పి పరువు దక్కించుకునే ప్రయత్నం చేసారు. చివరకు చైనా విదేశాంగ శాఖ ట్రంప్తో మాట్లాడలేదనీ, టారీఫ్లు ఎత్తేసేదాకా మాట్లాడే ప్రసక్తే లేదనీ ట్రంప్ అబద్దాలను బహిరంగంగా ఖండించింది. మరోవైపు చైనాతో ఒప్పందానికి వెంటనే రాకపోతే దేశంలో సరుకుల సంక్షోభం తలెత్తుతోందనీ, ఇప్పటికే షాపింగ్ మాల్స్లో షెల్పులు ఖాళీ అయ్యాయనీ వాల్మార్ట్, అమెజాన్ లాంటి అమెరికా దిగ్గజ వ్యాపార సంస్థలు గగ్గోలు పెట్టటం, ద్రవ్యోల్బణం పెరిగి ప్రజలు వీధుల్లోకి పెద్దఎత్తున రావటం ప్రారంభమైంది. దాంతో అమెరికా దిక్కుతోచక తానే చొరవజేసి సుంకాలు వెనక్కి తీసుకోవటానికి సిద్ధపడి చైనాతో చర్చలకు రంగం సిద్ధం చేసుకుంది. స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో రెండు దేశాల ప్రతినిధివర్గాలు సమావేశమై విధించిన సుంకాలు తగ్గించుకుని 90రోజుల తుది ఒప్పందానికి వచ్చే ప్రయత్నం చేయాలని అంగీకరించాయి.
అగ్రదేశంగా ఉన్న అమెరికా సుంకాల విషయంలో ఎందుకు ఇంతగా తడబాటుకు గరౌతోంది? అందరూ బెదిరిపోయి రాజీకి వస్తారనే అంచనాలు ముఖ్యంగా చైనా విషయంలో ఎందుకు తల్లకిందులౌతున్నాయి? ఈ విషయాలు మనం అర్ధం చేసుకోవాలి. చైనా నుండి ఏటా సుమారు 450బిలియన్ డాలర్ల (45లక్షల కోట్ల డాలర్లు) విలువైన ఉత్పత్తులు అమెరికా దిగుమతి చేసుకుంటుంది. దానికి బదులు సుమారు 150బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు మాత్రమే చైనాకు ఎగుమతి చేస్తుంది. చైనా ఎగుమతుల్లో ప్రధానంగా స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మందులు, యంత్ర విడిభాగాలు, గృహపరికరాలు, బొమ్మలు వగైరా ఉంటాయి. అమెరికా చేసే ఎగుమతుల్లో సోయాబీన్, మొక్కజొన్న, ఆయిల్, గ్యాస్ వగైరా ప్రధానం. చైనా ఎగుమతులపైనా ఆధారపడిన దేశం, అందునా చాలా భారీగా 450బిలియన్ డాలర్ల సరుకులు తాను కొనకపోతే వాటిపై సుంకాలు పెంచితే చైనా తట్టుకోలేక తప్పకుండా కాళ్లబేరానికి వస్తుందనేది అమెరికా అంచనా. కానీ జరగబోయేది అమెరికన్లకు తల్లకిందులుగా అర్థమయింది. అమెరికాకు అమ్మే సరుకులను వేరే దేశాలకు మళ్లించటానికి, అలాగే ఇంకా మిగిలే సరుకులను దేశంలోనే వినిమయం పెంచటానికి చైనా ప్రణాళి కలు సిద్ధం చేసి అమలు చేయటం ప్రారంభించింది. ఒక్క మే నెలలోనే అమెరికాకు చైనా ఎగుమతి చేసే సరుకులు 35% తగ్గిపోయాయి. మరోవైపు మొత్తం చైనా బయటి దేశాలకు చేసే ఎగుమతులు ఆ నెలలో 6శాతం పెరిగాయి. అమెరికాకు తగ్గిన మేరకు ఆసియాన్ దేశాలకు, యూరోప్, ఆఫ్రికా దేశాలకు చైనా ఎగుమతులు పెరిగాయి. ఆ విధంగా అమెరికా కాదంటే అవే సరుకులు చైనా వేరే దేశాలకు అమ్మగలిగింది. కానీ చైనా నుండి సరుకులు రాకపోతే అమెరికా పౌరుల జీవితం దుర్బరంగా తయారైంది. మార్కెట్లో సరుకులు లేక, ధరలు పెరిగి నానా ఇబ్బందులు పడ్డారు. ఒక ఉదాహరణగా చెప్పాలంటే మొత్తం అమెరికా పౌరులు వాడుతున్న స్మార్ట్ ఫోన్లలో 80శాతం చైనా నుంచి దిగుమతి చేసుకున్నవే. చైనాలో తయారయ్యే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు లేకండా ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసు కోవటం అమెరికాకు అసాధ్యం. అందుకే ట్రంప్ యంత్రాంగం ఈ విషయం పసిగట్టి సుంకాలు విధించిన మరుసటి రోజే చైనా వస్తువులపై సుంకాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులకు మినహాయింపు ప్రకటించింది.
ఈ సుంకాల యుద్ధమూ, చర్చోపచర్చలూ ఇంకా చాలా కాలమే సాగే అవకాశం ఉంది. అయితే సుంకాలతో వాణిజ్య యుద్ధంలా ఇది పైకి కనిపిస్నున్నప్పటికీ, అంతర్లీనంగా సోషలిస్టు చైనాను దెబ్బకొట్టాలనీ, తన ప్రపంచాధిపత్యాన్ని కాపాడుకోవాలనే వ్యూహాత్మకమైన అమెరికా సామ్రాజ్యవాద ప్రయత్నం దీని వెనక ఉంది. ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే ఈ సుంకాల పరంపర మొదలైంది. అలాగే ఒబామా కాలంలో కూడా ‘తూర్పుపై దృష్టి’ (పివోట్ టు ఈస్ట్) పథకాలతో దక్షిణ చైనా సముద్ర ప్రాంతం, తైవాన్, షిన్జియాంగ్ తదితర సమస్యపై చైనాను ఇరుకున బెట్టటానికి, చైనా వ్యతిరేక సైనిక కూటములు ఏర్పర్చటానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ వచ్చారు. ఇందుకు కారణం ఒక్కటే. నేటి అభివృద్ది సూచికల్లో అత్యధికవాటిలో చైనా దూసుకు పోతోంది. దానిని నిలవరించాలనేదే లక్ష్యం. ఆధునిక టెక్నాలజీ 44విభాగాల్లో 33లో చైనా ఇప్పటికే అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా ట్రాన్స్పోర్టు, ఎలక్ట్రిక్ వెహికల్స్, స్పీడ్రైల్, డిజిటల్ టెక్నాలజీ, సూపర్ కంప్యూటర్స్, జీరో కార్బన్ ఎనర్జీ, ఫోర్త్ జనరేషన్న్లూక్లియర్ టెక్నాలజీ వీటన్నింటిలో చైనా ముందున్నది. రాబోయే దశాబ్దాలలో ప్రపంచాన్ని నడిపించేది ఈ టెక్నాలజీలే.
చైనా యొక్క ఈ అభివృద్దిని అడ్డుకోవటానికి గత పదేండ్లుగా అమెరికా చేయని ప్రయత్నమంటూ లేదు. ముఖ్యంగా ఆధునిక చిప్స్, చిప్స్ తయారుజేయటానికి ఉపయోగించే లితోగ్రాఫిక్ యంత్రాలు చైనాకు ఏ దేశమూ ఎగుమతి చేయరాదంటూ అమెరికా అనేక ఆంక్షలు విధించింది. చైనా దిగ్గజ టెక్ సంస్థ ‘హువావే’ ఉత్పత్తులు 5జి వగైరా కొనుగోలు చేయవద్దని, ఇంకా వందలకొద్దీ యాప్ల నిషేధంలాంటి చర్యలు అమలుజేసింది. ఇందుకు ప్రపంచాన్ని ఒప్పించటానికి ఒక వాదన ముందుకు తెచ్చింది. అదేమంటే ఈ టెక్నాలజీ వినిమయ వస్తువులను ఉత్పత్తి చేయటంతోపాటు మిలటరీ ఉత్పత్తులకు ఉపయోగపడుతుందనీ చైనా ఈ టెక్నాలజీని మిలటరీ ప్రయోజనాలకు వాడుతోందనీ అది అమెరికా ‘భద్రత’కు ప్రమాదమనీ సాకులు చెప్పింది. ఆ రీతిగా అమెరికా పార్లమెంట్తో చట్టాలు చేయించింది. అయితే ఇప్పుడీ ‘భస్మాసుర హస్తం’ అమెరికా నెత్తిపైకే వచ్చింది. ఇపుడు అమెరికా ఆంక్షలకు విరుగుడుగా చైనా తమ దేశం నుండి ‘అరుదైన మట్టి’ ఎగుమతులను అదుపుజేసింది. రేర్ ఎర్త్ (అరుదైన మట్టి) అనేది అపురూప ఖనిజాలు అనేకం నిక్షిప్తమై ఉండే మట్టి. మొత్తం ప్రపంచంలో ఉన్న ఈ మట్టి నిల్వల్లో 70శాతం ఒక్క చైనా దేశంలోనే ఉన్నాయి. మిగతా 30శాతం బ్రెజిల్, ఉక్రెయిన్, అమెరికా, ఇండియా ఇంకా తదితర దేశాల్లో ఉన్నాయి. అయితే మిగతా ప్రాంతాల్లో 30% ఉన్నా దానిని ప్రాసెస్ చేసి ఖనిజాల రూపంలో, మాగెట్స్ రూపంలో తయారు జేసే రిఫైనింగ్ సామర్ధ్యం 95శాతం చైనా దేశంలోనే ఉంది. దీని నుండి తయారయ్యే ఖనిజాలలో ఏడు చాలా ముఖ్యమైనవి. వాటిలో కూడా ‘సమారిన్’ అనే ఖనిజం అతి ముఖ్యమైనది. స్మార్ట్ ఫోన్ నుండి రాకెట్దాకా ముఖ్యంగా యుద్ధ సామాగ్రి, ఆయుధాలు జెట్ఫైటర్స్, మిసైల్స్ వగైరా అన్నింటి తయారీకి ఈ ఖనిజం చాలా అవసరం. ఇది లేకుండా ఏ ఒక్క ఆయుధం తయారు కాదు. ఇటీవల ఓ యూట్యూబ్ చర్చలో జియోపొలిటికల్ ప్రముఖ విశ్లేషకుడు కార్ల్ జా సరదాగా ‘ఈ రేర్ ఎర్త్ ఉత్పత్తులను శాశ్వతంగా ఆపేస్తే ప్రపంచ శాంతి సులభంగా సాధించొచ్చు’ అన్నాడు. అంతటి ప్రాముఖ్యత ఈ ఖనిజానికి ఉంది. ఇపుడు చైనా ఏమంటోందంటే ‘ఈ ఖనిజాలు వినిమయ వస్తువులకే కాదు. మిటటరీ ఆయుధాలకు కూడా వినియోగించొచ్చు. అందువల్ల ఏ దేశమైనా దానిని మిలటరీ ప్రయోజనాలకు వాడి మా దేశ భద్రతకు హాని కలిగించొచ్చు. కాబట్టి మిలటరీ ప్రయోజనాలకు కాదని గట్టిగా హామీ ఇచ్చేట్లయితేనే దానిని ఎగుమతి చేసే విధంగా లైసెన్స్ల జారీని క్రమబద్దీకరి స్తున్నామని ప్రకటించింది. ఎగుమతులు ఆపేసింది. దాంతో ఆయుధ ఉత్పత్తిదారులంతా ఇపుడు గగ్గోలుపెట్టారు. అమెరికాకు ఏం చేయాలో పాలుపోవటం లేదు. చైనా జెనీవా ఒప్పందాన్ని అమలు జేయటంలేదనీ, వారిపై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నా మనీ, వారి విద్యార్థి వీసాలు రద్దు చేస్తున్నామనీ హూంకరిం చటం మొదలుపెట్టింది. అయినా చైనా బెదరలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమైంది. దాంతో జూన్ 5న డోనాల్ట్ ట్రంప్ దిగివచ్చి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు ఫోన్ చేసి గంటన్నర సేపు సంప్రదింపులు జరిపాడు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చించటానికి ఈ సంభాషణలో ఇరువురూ అంగీకరించారు. దీంతో ప్రపంచం కాస్త ఊపిరి పీల్చుకుంది. ఇరువురి మధ్యా చర్చలు జరుగుతాయనీ, ఒప్పందం కుదురుతుందనీ అందరూ ఆశించారు.
ఇరువురు అధ్యక్షులు అంగీకరించిన విధంగా జూన్ 10, 11తేదీల్లో మూడో దేశమైన లండన్ నగరంలో అమెరికా, చైనా ప్రతినిధివర్గాల మద్య 20గంటల పాటు సుదీర్ఘ వాణిజ్య చర్చలు జరిగాయి. అమెరికా తరఫున ఆర్ధిక మంత్రి స్కాట్ బిసెంట్, చైనా తరఫున ఉప ప్రధాని హి లీఫెంగ్ నాయకత్వం వహిం చారు. సమావేశం తరువాత ఉమ్మడి ప్రకటనేమీ రాలేదు. అమెరికా తరఫున వాణిజ్య మంత్రి ఓ ప్రకటన చేస్తూ ఒప్పందం కుదిరిందనీ, అయితే దానిని ఇరుదేశాల అధ్యక్షులకు నివేదించాక వారు ఒప్పుకున్నాక అమలు చేస్తామనీ ప్రకటించారు. తరువాత మరుసటి రోజే ట్రంప్ తన సహజదోరణిలో తన ట్విటర్ ఖాతాలో ఒప్పందం కుదిరందనీ, చైనా రేర్ ఎర్త్ ఎగుమతులు ఎప్పటిలాగా చేయటానికి అంగీకించిందనీ, టారిప్లు 55% చైనాపై, 10%అమెరికాపైన నిర్ణయించుకున్నామనీ” ప్రకటిం చాడు. కానీ అంర్జాతీయ మీడియా వార్తలు చూసినా, చైనా వివరణ చూసినా ట్రంప్ ప్రకటన వాస్తవం కాదని అర్ధమౌతోంది. వాణిజ్యవివరాలతో ఒప్పందం ఏమీ కుదరలేదు. కాకపోతే ఒప్పందం కుదుర్చుకోవావాలనే దానిపైన ఒప్పందం కుదిరింది. అంటే వాణిజ్య అంశాలు చర్చించటానికి విధి, విధానాలు మాత్రమే రూపొందించారు. వాటిపై చర్చించటానికి యంత్రాంగాన్ని మాత్రం నిర్ణయించకున్నారు. అంతే తప్ప తుది ఒప్పందం కుదరలేదు. చర్చలలో అమెరికా వైపునుండి రేర్ఎర్త్ ఖనిజాలపై ఆంక్షలు ఎత్తివేయటం గురించీ, చైనా వైపు నుండి టెక్నాలజీ ఎగుమతులపై ఆంక్షల గురించీ ప్రదానంగా ప్రస్తావనలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఏమైనా భవిష్యత్తులో జరిగే అనేక దఫాల చర్చలలో గానీ అసలు విషయాలపై ఏ విధమై నిర్ణయాలు జరగబోయేదీ తెలుస్తుంది. ఈ చర్చల ఫలితాలకోసమే మిగతా ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఏమైనా అమెరికా అనాలోచితంగా తలపెట్టిన ఈ వాణిజ్య యుద్దంలో అది సాధించే ఫలితాల కన్నా తన ప్రపంచాధిపత్యాన్ని కోల్పోతున్న లక్షణాలే ప్రస్ఫుమవుతు న్నాయనేది పరిశీలకుల విశ్లేషణగా ఉంది.
‘లిబరేషన్ డే’ పేర డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 3 లక్ష్యాలు నెరవేరతాయా? అందుకు ఆచరణలో ఉన్న ఆటంకాలేమిటి? ఈ సుంకాల యుద్దంలో అమెరికా వత్తిడికి తలొగ్గితే భారత్ ఆర్ధిక పరిస్థితి ముఖ్యంగా వ్యవసాయరంగంలో ఏ పరిణామాలు సంభవిస్తాయనేది మరోసారి చర్చిద్దాం.
తమ్మినేని వీరభద్రం
అమెరికా సుంకాల దాడి – అడ్డుకుంటున్న చైనా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES