చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..
బీజింగ్ : ఎప్పుడూ చైనాపై ఏదో ఒక దర్యాప్తు మొదలుపెట్టామని అమెరికా చెప్పడం సర్వసాధారణంగా చూస్తుంటాం. కానీ, ఈ సారి సీను రివర్స్ అయింది. వాషింగ్టన్ రెండు అంశాల్లో తప్పుడు విధానాలు అవలంభిస్తోందంటూ.. బీజింగ్ రెండు దర్యాప్తులు మొదలుపెట్టింది. అది కూడా స్పెయిన్లోని మాడ్రిడ్లో రెండు దేశాల మధ్య చర్చలు మొదలుకానున్న వేళ కావడం గమనార్హం. ఈ సమావేశంలో జాతీయ భద్రత, టిక్టాక్ సోషల్ మీడియా యాజమాన్య హక్కుల వంటివి చర్చకు రానున్నాయి. అమెరికా సెమీ కండెక్టర్లను లక్ష్యంగా చేసు కొని చైనా ఈ దర్యాప్తులు చేపట్టింది. కొన్ని ఐసీ చిప్స్లో అమెరికాపై యాంటీ డంపింగ్ ఇన్వెస్టి గేషన్ను మొదలుపెట్టింది. వీటిని అమెరికాలోని టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, ఆన్ చిప్స్ సంస్థలు తయారు చేస్తుంటాయి. చైనాలో తయారైన సెమీకండెక్టర్లపై వివక్ష చూపుతోందంటూ మరో దర్యాప్తును చేపట్టింది. ఆదివారం మాడ్రిడ్లో చైనా వైస్ప్రీమియర్ లిఫెంగ్, అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెస్సెంట్ భేటీ కానున్నారు. అమెరికా ఎగుమతి నియంత్రణలు, టారిఫ్లు వంటి వాటిని ఈ సందర్భంగా చైనా బలం గా ప్రస్తావించే అవకాశం ఉంది. శుక్రవారం అమెరికా ప్రభుత్వం 23 సంస్థ లను ఆంక్షల పరిధిలోని జాబితాలో చేర్చడంతో చైనా ప్రతీకారంగా ఈ నిర్ణయం తీసుకుంది. వీటిల్లో చైనా చిప్స్ తయారీ సంస్థ ఎస్ఎంఐసీ కూడా ఉంది.