1-4తో హాకీ ఇండియా పరాజయం
మహిళల హాకీ ఆసియా కప్ 2025
గాంగ్జూ (చైనా) : మహిళల హాకీ ఆసియా కప్లో టీమ్ ఇండియా తడబడింది. సూపర్ 4 దశలో తొలి మ్యాచ్లో దక్షిణ కొరియాపై 4-2తో గెలుపొందిన అమ్మాయిలు.. రెండో మ్యాచ్లో ఆతిథ్య చైనా చేతిలో పరాజయం పాలయ్యారు. కుండపోత వర్షం కారణంగా ఆలస్యంగా ఆరంభమైన సూపర్ 4 మ్యాచ్లో చైనా 4-1తో విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభమైన నాల్గో నిమిషంలోనే చైనా గోల్ ఖాతా తెరిచింది. తొలి రెండు క్వార్టర్ల మ్యాచ్లో చైనా 1-0తో ముందంజలో నిలిచింది. మూడో క్వార్టర్ ఆరంభమైన తొలి నిమిషంలో చైనా మరో గోల్ కొట్టింది. దీంతో చైనా 2-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత్ నుంచి ముంతాజ్ ఖాన్ 38వ నిమిషంలో గోల్ చేయటంతో భారత్ 1-2తో రేసులోకి వచ్చింది. కానీ చైనా వరుసగా 47వ, 56వ నిమిషాల్లో ఓ పెనాల్టీ కార్నర్, ఫీల్డ్ గోల్తో మెరిసింది. దీంతో చైనా 4-1తో గెలుపొందింది. సూపర్ 4 దశలో చివరి మ్యాచ్లో జపాన్తో భారత్ ఆడనుంది. సూపర్4 దశలో టాప్-2లో నిలిచిన జట్లు నేరుగా ఫైనల్కు అర్హత సాధిస్తాయి.