నవతెలంగాణ-హైదరాబాద్ : గత 17 రోజులుగా హైదరాబాద్లో కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుంది. సమ్మె కారణంగా తెలుగుతో పాటు ఇతర భాషల సినిమా షూటింగులు కూడా నిలిచిపోవడంతో ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ జోక్యంతో ఈ రోజు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.
హైదరాబాద్ను దేశంలోనే ప్రధాన సినిమా హబ్గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ సమ్మె అడ్డంకిగా మారిందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర సినిమా పాలసీపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో, సమస్య పరిష్కారానికి అధికారులు ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో ఒక విడత చర్చలు జరిపారు. దీనికి కొనసాగింపుగా, ఈరోజు ఫెడరేషన్ నాయకులతో కూడా సమావేశం కానున్నారు. డీజీపీ సైతం ఫెడరేషన్ నేతలతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.