Friday, May 30, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకార్మికుల విరాళాలతోనే సీఐటీయూ భవనం

కార్మికుల విరాళాలతోనే సీఐటీయూ భవనం

- Advertisement -

– కార్యాలయానికి కార్మికోద్యమ నేత ఎన్‌.వి.భాస్కర్‌రావు పేరు
– ఐక్యతా పోరాటంతోనే ముందుకెళ్తాం
– హక్కులకోసం నికరంగా నిలబడుతున్నాం కాబట్టే పరిశ్రమల్లో సీఐటీయూ గెలుపు
– లేబర్‌ కోడ్‌లు కార్మికవర్గానికి అత్యంత ప్రమాదకరం
– దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విశాల ఐక్య ఉద్యమం నవతెలంగాణతో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు
‘కార్మికోద్యమ నేత ఎన్‌వి. భాస్కర్‌రావు పేరిట హైదరాబాద్‌లో నిర్మించిన సీఐటీయూ రాష్ట్ర కార్యాలయాన్ని 30న ప్రారంభించుకోబోతున్నాం. ఆ భవన నిర్మాణం మొత్తం కార్మికుల విరాళాలతోనే కట్టడం గొప్ప పరిణామం. బయట పైసా కూడా తీసుకోలేదు. హక్కుల కోసం నిరంతరం కొట్లాడుతున్నాం కాబట్టే కార్మికులు సీఐటీయూకి అండగా ఉంటున్నారు. లేబర్‌కోడ్‌లు కార్మికవర్గానికి అత్యంత ప్రమాదకరంగా మారబోతున్నాయి. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విశాల ఐక్య ఉద్యమం నడుస్తున్నది. ఐక్యతాపోరాటమే నినాదం నుంచే సీఐటీయూ పుట్టింది. కార్మికవర్గాన్ని మొత్తం ఐక్యం చేసి వర్గపోరాటం ద్వారా దోపిడీలేని సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా సీఐటీయూ ముందుకు సాగుతున్నది. ఆ దిశగా సాగే పోరాటాలకు ఎన్‌విబి భవనం అడ్డాగా మారుతుందని ఆకాంక్షిస్తున్నాను. ఆ భవనం శుక్రవారం సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ చేతులమీదుగా ప్రారంభం కాబోతున్నది.’ అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు చెప్పారు. సీఐటీయూ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం…ఆ యూనియన్‌ పోరాటాలకు సంబంధించి నవతెలంగాణ ప్రతినిధికి ఆయన ఇంటర్వూ ఇచ్చారు. అందులోని కీలక అంశాలివే.

ఎన్‌విబి పేరే ఎందుకంటే..
ఎన్‌విబి పేరు ద్వారానే కార్మికవర్గానికి ఆయన సుపరిచితం. పీడిత, తాడిత జనానికి బాసటగా ఉంటూ హైదరాబాద్‌ మహానగరంలో కార్మికవర్గ ఉద్యమ విస్తరణలో ఆయన పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కార్మికవర్గపోరాట నిర్మాణంలో తనదైన ముద్రవేశారు. పబ్లిక్‌రంగంలోని కంపెనీల నుంచి ప్రయివేటు సెక్టార్‌ వరకు అనేక పరిశ్రమల్లో కార్మికులను సంఘటిత పరిచి హక్కుల కోసం పోరాటం చేయించిన నాయకుడు ఎన్‌వి.భాస్కర్‌రావు. ఆయన పేరుతో స్మారక కేంద్రం ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్‌లో ఏర్పాటైంది. కొత్తగా కట్టిన సీఐటీయూ రాష్ట్ర కార్యాలయానికి కూడా ఆయన పేరునే కొనసాగించనున్నాం.
నిర్మాణంలో ప్రతిపైసా కార్మికులదే
సీఐటీయూ కార్యాలయం నిర్మాణం మొత్తం కార్మికుల విరాళాలతోనే జరిగింది. పోరాటాలకు ఆయుపట్టుగా ఉండే కార్యాలయం నిర్మాణం వెనుక కార్మికుల శ్రమ పాత్ర ఉండటం గొప్ప పరిణామం. తెలంగాణలో సీఐటీయూకు 2.5 లక్షల సభ్యత్వం ఉంది. అసంఘటిత, సంఘటిత రంగంలోని కార్మికులు, పబ్లిక్‌ సెక్టార్‌, భారీ, మధ్యతరహా పరిశ్రమల్లోని ఉద్యోగులు, కార్మికులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు తమకు తోచినంత విరాళాలు ఇచ్చారు. సీఐటీయూ అనుబంధ సంఘాల్లోని ప్రతి అసంఘటిత కార్మికుని నుంచి కనీసం రూ.50 చొప్పున, మిగతా కార్మికుల నుంచి కనీసం రూ.100 చొప్పున విరాళాలు సేకరించాం. సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో పారిశ్రామిక వాడలు ఎక్కుగా ఉన్నాయి. అక్కడ ఉన్న సీఐటీయూ అనుబంధ యూనియన్లకు చెందిన కార్మికులు తమ ఒక్కరోజు వేతనం ఇచ్చారు. గోదావరి పాలిమర్స్‌ కంపెనీ ఇటీవల మూతపడింది. సీఐటీయూగా యాజమాన్యంతో కొట్లాడి మెరుగైన ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ చేసి కార్మికులకు లబ్ది చేకూర్చాం. దాంతో ఆ కంపెనీ కార్మికులు రూ.5 లక్షలు విరాళం ప్రకటించారు. అన్ని తరగతుల కార్మికుల యొక్క సహకారంతో ఈ కార్యాలయం పూర్తిచేశాం. 33 జిల్లాల కార్మికులు విరాళాల సేకరణలో పాలుపంచుకున్నారు.
కార్మికవర్గానికి లేబర్‌ కోడ్‌లు అత్యంత ప్రమాదకరం
కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్‌ల బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదించుకున్నది. 2019 నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. సీఐటీయూ విడిగా, ఇతర సంఘాల ఐక్య పోరాటాల ఫలితంగా వాటిని కేంద్ర ప్రభుత్వం ఇంకా గెజిట్‌ చేయలేదు. అయినా, ప్రమాదం పొంచి ఉంది. దీనిపై పోరాటాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రకటించుకునే ప్రయత్నం చేస్తున్నది. బీఎంఎస్‌ మినహా జూలై 9న అఖిల భారత సమ్మెకు సిద్ధం అవుతున్నాయి. లేబర్‌ కోడ్‌లు వస్తే జీతాల పెంపు కోసం యాజమాన్యాలతో సమిష్టి బేరసారాలాడే హక్కును కార్మికులు కోల్పోతారు. పరిశ్రమల్లో కార్మిక సంఘాలుండవు. కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదు. ట్రేడ్‌ యూనియన్ల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. రెగ్యులర్‌ కార్మికుల స్థానంలో ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కార్మికులను తీసుకొచ్చే ప్రమాదముంది. దీంతో కార్మికులకు ఏ హక్కులూ ఉండవు. ఉద్యోగ భద్రతకూ గ్యారంటీ ఉండదు. శాశ్వత ఉద్యోగాలుండవు. జూలై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను దృష్టిలో పెట్టుకుని క్యాంపెన్‌ నడుస్తున్నది.

ఐక్యపోరాటాలే లక్ష్యంగా…
సీఐటీయూ ఆవిర్భవించిందే ఐక్యతా పోరాటం నినాదం నుంచి. ఎక్కడ కూడా కార్మికులు చీలి ఉండొద్దనేది సీఐటీయూ ప్రధాన లక్ష్యం. ఉమ్మడి పోరాటాలవైపే మొగ్గుచూపుతున్నది. లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తగా జరుగుతున్న పోరాటాల్లో అన్ని యూనియన్లనూ ఒక్కతాటిపైకి తీసుకురావడంలో సీఐటీయూదే కీలకపాత్ర. కార్మికులను ఐక్యం చేసే కృషి నిరంతం కొనసాగాలని సీఐటీయూ నిర్ణయించాం. అంగీకరించిన ఐక్య డిమాండ్లపై అన్ని యూనియన్లతోనూ కలిసి పోరాడేందుకు సీఐటీయూ ఎప్పుడూ ముందువరుసలో ఉంటున్నది. రాబోయే రోజుల్లో కార్మిక వర్గ ఐక్యతను మరింత బలోపేతం చేస్తాం. అయితే, ఐక్యతను బలహీనపర్చేందుకు హిందూ మతోన్మాద భావజాలాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంఘాలు పరిశ్రమల్లో ప్రచారం చేస్తున్నాయి. ఈ విషయంలో కార్మికులను చైతన్యపరిచే గురుతర బాధ్యత సీఐటీయూపై ఉంది. కులపరమైన అస్తిత్వ ధోరణుల ప్రచారం పబ్లిక్‌ సెక్టార్‌ రంగంలో తీవ్రంగా ఉంది. వీటికి వ్యతిరేకంగానూ కార్మికులను చైతన్యం చేయాల్సిన అవసరముంది. సీఐటీయూ నాయకులు, కార్యకర్తలు సామాజిక, రాజకీయ అంశాలను ఒక అంశంగా చేర్చుకుని క్షేత్రస్థాయి నుంచి కార్మికుల ఐక్యత సాధనపై దృష్టి పెడుతున్నాం. సీఐటీయూ అంతిమ లక్ష్యం మొత్తం కార్మికులను ఒక వర్గం ఐక్యం చేయడం. వర్గ పోరాటం ద్వారానే దోపిడీ లేని సమాజం సాధ్యం.

తపన్‌సేన్‌తో ప్రారంభం
ఎన్‌విబి భవనాన్ని సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ ప్రారంభిస్తారు. మొదటి అంతస్తును తమ యూనియన్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి బీవీ రాఘవులు, రెండో అంతస్తును అఖిల భారత అధ్యక్షులు డాక్టర్‌ హేమలత ఓపెనింగ్‌ చేయనున్నారు. మిగతా గదులను ఉమ్మడి ఏపీ పూర్వ అధ్యక్షులు ఎంఏ గపూర్‌, సీహెచ్‌ నర్సింగరావు, ఆర్‌.సుధాభాస్కర్‌, సీఐటీయూ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వీరయ్య ప్రారంభిచనున్నారు. సీఐటీయూ సీనియర్‌ నేత పి.రాజారావు జెండావిష్కరణ చేయనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి అన్ని జిల్లాల కమిటీ సభ్యులను, ముఖ్యమైన యూనియన్ల ఆఫీస్‌ బేరర్లను ఆహ్వానించాం. కార్మికుల సమక్షంలోనే బిల్డింగ్‌ ప్రారంభించబోతున్నాం.

భారీ, మధ్యతరహా పరిశ్రమల్లో బలమైన శక్తిగా సీఐటీయూ
హైదరాబాద్‌ నగరం చుట్టూ ఉన్న భారీ, మధ్యతరహా పరిశ్రమల్లో సీఐటీయూ బలమైన శక్తిగా ఉంది. అక్కడ యాజమాన్యాలతో గుర్తింపు సంఘంగా కొట్లాడి మంచి వేతన ఒప్పందాలను సాధిస్తున్నాం. దీంతో కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. అందుకే సీఐటీయూని వారు ఆదరిస్తున్నారు. ఉద్యోగ భద్రత, పని పరిస్థితులు, ఇతరత్రా సమస్యలు వచ్చినప్పుడు కార్మికుల పక్షాన నిలబడి నికరంగా కొట్లాడుతున్నాం. సంక్షేమ పథకాలను అమలు చేయించడంలోనూ సీఐటీయూదే కీలక భూమిక. సామాజిక న్యాయ సాధన కోసం ప్రత్యేక క్యాంపెయిన్‌లు చేపడుతున్నాం. కార్మిక వర్గాన్ని నిరంతరం చైతన్యం చేయడం ద్వారా ఆయా పరిశ్రమల్లో మంత్రులు, పెద్దపెద్ద నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పోటీ చేసినా కార్మికులు సీఐటీయూ నాయకులనే గెలిపిస్తూ వస్తున్నారు. ఆ రకంగా సీఐటీయూ కార్మికులకు దగ్గర అవుతున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -