Wednesday, June 11, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలు12 ఎస్సీ గురుకుల జూనియర్‌ కాలేజీల మూసివేత

12 ఎస్సీ గురుకుల జూనియర్‌ కాలేజీల మూసివేత

- Advertisement -

– సరిపడా విద్యార్థుల్లేరనే సాకుతో సర్కారు నిర్ణయం
– ఆ విద్యార్థులు వేరే కళాశాలల్లోకి..
– వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు
– ఆందోళనలో విద్యార్థులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) ఆధ్వర్యంలోని 12 జూనియర్‌ కాలేజీలు మూతపడుతున్నాయి. సరిపోయినంత మంది విద్యార్థులు చేరడం లేదనే సాకుతో వాటిని ఎత్తేయాలని టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ నిర్ణయించింది. అక్కడ చదువుతున్న విద్యార్థులను దగ్గరలోని టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ జూనియర్‌ కాలేజీల్లోకి మార్చాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం (2025-26) నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దీంతో అక్కడ చదువుతున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఆ 12 ఎస్సీ గురుకులాల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందాలనే ఆశతో ఉన్న విద్యార్థులకు నిరాశే ఎదురు కానుంది. ఈ నిర్ణయం వల్ల దళిత విద్యార్థులు తీవ్రంగా నష్టపోనున్నారు. ఒక్కో జూనియర్‌ కాలేజీలో రెండు కోర్సుల చొప్పున ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 120 సీట్లు, ద్వితీయ సంవత్సరంలో 120 సీట్లు కలిపి 240 సీట్లుంటాయి. ఈ లెక్కన 12 ఎస్సీ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో 2,880 సీట్లు రద్దవుతాయి. అంటే పేద విద్యార్థులు ముఖ్యంగా దళిత విద్యార్థులు గురుకుల విద్యను కోల్పోతారు. టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
మసకబారుతున్న గురుకులాల ప్రతిష్ట
రాష్ట్రంలో ప్రయివేటు, కార్పొరేట్‌ జూనియర్‌ కాలేజీలకు దీటుగా గురుకుల విద్యాసంస్థలు నడుస్తున్నాయి. పదో తరగతి, ఇంటర్‌ ఫలితాల్లో ప్రభంజనం సృష్టిస్తున్నాయి. గురుకులాల్లో చదివే విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచి సత్తా చాటుతున్నారు. పది, ఇంటర్‌ ఫలితాలతోపాటు జేఈఈ, నీట్‌, ఎప్‌సెట్‌ వంటి ప్రవేశ పరీక్షల్లోనూ మంచి ర్యాంకులను సాధిస్తున్నారు. పదేండ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ గురుకులాలను అభివృద్ధి చేసేందుకే ప్రాధాన్యత ఇచ్చింది. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను అందించడంలో భాగంగా 293 ఉన్న గురుకులాలను 1023కి పెంచింది. ఇందులో ఎస్సీ గురుకులాలు 268 ఉన్నాయి. ఇందులో 1.50 లక్షల మంది చదువుతున్నారు. 238 ఎస్సీ గురుకుల జూనియర్‌ కాలేజీలున్నాయి. వాటిలో 31,564 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఎస్సీ గురుకులాల్లో ఎంపీపీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎస్సీ గురుకుల విద్యాసంస్థల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ (సీవోఈ)లకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ప్రత్యేక ప్రవేశపరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. వాటిలో జేఈఈ, నీట్‌, ఎప్‌సెట్‌ కోచింగ్‌లపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. సాధారణ ఎస్సీ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో పదో తరగతి గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌ (జీపీఏ) ఆధారంగా విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. ఇంత ప్రతిష్ట ఉన్న ఎస్సీ గురుకుల విద్యాసంస్థల్లోని మొత్తం సీట్లలో ఇప్పుడు విద్యార్థులు చేరడం లేదు. గురుకులాల్లోనూ సీట్లు మిగిలే దుస్థితికి చేరుకున్నాయి. దీంతో వాటి ప్రతిష్ట మసకబారుతున్నది.
సమీకృత గురుకులాల పేరుతో ఆర్భాటం
ఇంకోవైపు గురుకులాల సంఖ్యను 293 నుంచి 1023కు గత ప్రభుత్వం పెంచినా వాటిలో 662 గురుకులాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మౌలిక వసతుల సమస్య, ఇతర కారణాలతో విద్యార్థులు చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. సొంత భవనాలను నిర్మించి వసతులను మెరుగుపర్చాల్సిన ప్రభుత్వం ఆ కాలేజీలను మూసివేయాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మరోవైపు అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున సమీకృత గురుకులాలను నిర్మిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. 105 సమీకృత గురుకులాలను మంజూరు చేసింది. వాటిలో 58 సమీకృత గురుకులాల నిర్మాణం కోసం రూ.662 కోట్లు విడుదల చేసింది. రెండేండ్లలో వాటిని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఒకవైపు సమీకృత గురుకులాల పేరుతో ఆర్భాటం చేస్తూనే ఇంకోవైపు గతంలో ఉన్న 12 ఎస్సీ గురుకులాలను మూసివేయాలన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేట్‌ కాలేజీల్లో రూ.లక్షల ఫీజులతో విద్యావ్యాపారం చేస్తున్నాయి. గురుకులాల వల్లే కార్పొరేట్‌ కాలేజీల వల్ల తల్లిదండ్రులకు కొంత ఉపశమనం ఉన్నది. ఇప్పుడు 12 గురుకుల జూనియర్‌ కాలేజీలను మూసివేయడంతో కార్పొరేట్‌ విద్యాసంస్థల వ్యాపారం పెంచడానికే ఉపయోగపడుతుందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు.
ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి : ఎస్‌ఎఫ్‌ఐ
రాష్ట్రంలో 12 ఎస్సీ గురుకుల జూనియర్‌ కాలేజీలను మూసివేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ రజినీకాంత్‌, కార్యదర్శి టి నాగరాజు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో గురుకులాల ద్వారా పేద విద్యార్థులకు ప్రధానంగా అణగారిన వర్గాల వారికి డిగ్రీ వరకు విద్య అందుతున్నదని తెలిపారు. కార్పొరేట్‌ కాలేజీల్లో రూ.లక్షల ఫీజు వసూళ్లకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ గురుకులాలు విద్యార్థులకు ఎంతో ఆసరాగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు 12 ఎస్సీ గురుకుల జూనియర్‌ కాలేజీలను మూసేయడం ద్వారా పేద విద్యార్థులు ఇంటర్‌ విద్యకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆ గురుకులాలను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. వాటిని అభివృద్ధి చేసి మరింత మంది విద్యార్థులకు ప్రవేశాలను కల్పించాలని కోరారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -