నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి తన తప్పు ఒప్పుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలపై గురువారం కేటీఆర్ స్పందించారు. ప్రభుత్వం తరఫున వాదిస్తున్న అడ్వొకేట్ను హెచ్చరించిన సుప్రీంకోర్టు, కంచ గచ్చిబౌలి అడవుల విధ్వంసానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు అధికారులను జైలుకు పంపించాలా అంటూ హెచ్చరించిందని తెలిపారు. రేవంత్ రెడ్డి చేసిన తప్పులకు తెలంగాణ ప్రభుత్వ అధికారులు శిక్ష ఎదుర్కొనే పరిస్థితి నెలకొందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ అధికారులకు సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసిందన్నారు. వీటన్నింటికీ తాను బాధ్యుడిని కాదని రేవంత్ రెడ్డి తప్పించుకునే అవకాశం లేదని కేటీఆర్ హెచ్చరించారు. రేవంత్రెడ్డి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై, కంచ గచ్చిబౌలి వ్యవహారంలో చేసిన తప్పులను ఒప్పుకోవాలని సూచించారు. వందల బుల్డోజర్లతో ధ్వంసం చేసిన కంచ గచ్చిబౌలి అడవులను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రేవంత్ రెడ్డికి కోర్టు శిక్షలు తప్పవని హెచ్చరించారు. కంచ గచ్చిబౌలి భూములను అమ్మి రూ.10 వేల కోట్ల స్కాం చేయడం ముమ్మాటికి అవినీతి, నమ్మక ద్రోహమేనని స్పష్టం చేశారు. సెలవు దినాల్లో బుల్డోజర్లను పంపి అడవులను ధ్వంసం చేయడం ముమ్మాటికి పర్యావరణ చట్టాల ఉల్లంఘనేనని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్య చర్యల ఫలితంగా పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కంచ గచ్చిబౌలి భూములను ప్రభుత్వం కాపాడాల్సిందేనని కోరారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తాను సృష్టించిన విధ్వంసానికి, తన బాధ్యతారాహిత్యానికి, చేసిన రూ.10 వేల కోట్ల స్కాంకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి తప్పు ఒప్పుకోవాలి : కేటీఆర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES