- Advertisement -
- రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి : మాజీ మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు సినిమా చూపించే వారికే అబద్ధాలు చెప్పి సినిమా చూపించారని ఎద్దేవా చేశారు. మంగళవారం నాటి సీఎం సభకు బలవంతంగా మెడపై కత్తి పెట్టి తీసుకెళ్లారని ఆరోపించారు. భయంతోనే వారు సీఎం సభకు వెళ్లారని తెలిపారు. దీనిపై బీఆర్ఎస్ తరపున ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, ఆయన అనుచరుల దాడులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. పోటీ చేస్తున్నప్పుడే భయానక పరిస్థితి కల్పిస్తున్నారనీ, ఇక గెలిస్తే ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి దివగంత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కూతురిపై కూడా అక్రమ కేసులు పెట్టడంతో పాటు గుండాలు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఈసీ చెప్పినట్టు కాకుండా నవీన్ యాదవ్ చెప్పినట్టు వింటున్నారని ఆరోపించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ప్రజలు బీఆర్ఎస్కు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ సినీ కార్మికులు కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. అల్లు అర్జున్ను జైల్లో పెట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలా? నాగార్జున కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినందుకు ఓట్లు వేయాలా? సమంతను నీచాతి నీచంగా మాట్లాడినందుకు ఓట్లు వేయాలా? అని నిలదీశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినరు భాస్కర్ ,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు.
- Advertisement -



