జనరల్ కౌన్సిల్ సభ్యులుగా 87 మంది ఎంపిక
45 మందితో కేంద్ర కమిటీ
ఆపీసు బేరర్లుగా 23 మందికి చోటు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సీఎన్ భారతి (హర్యానా) చావ రవి(తెలంగాణ) ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జరిగిన రజతోత్సవ మహాసభల మూడోరోజు ముగింపు సభలో సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జనరల్ కౌన్సిల్ సభ్యులుగా 87 మంది, కేంద్ర కమిటీ సభ్యులుగా 45 మంది, ఆఫీస్ బేరర్లుగా 23 మంది ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి కేంద్ర కమిటీలో మహిళా ప్రతినిధిగా సీహెచ్ దుర్గా భవాని, జనరల్ కౌన్సిల్ సభ్యులుగా ఎ.వెంకట్, ఆర్.శారదలకు స్థానం దక్కింది. వీరు మూడేండ్ల పాటు ఆ బాధ్యతల్లో కొనసాగుతారు. విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా నాలుగు దశల పోరాట కార్యక్రమానికి మహాసభ పిలుపునిచ్చింది. మొదటి దశలో మండల కేంద్రాల్లో, రెండవ దశలో జిల్లా కేంద్రాల్లో, మూడోదశలో రాష్ట్ర కేంద్రంలో, నాలుగో దశలో దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించాలని మహాసభ నిర్ణయించింది.ఈ దశల వారి పోరాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మహసభ పిలుపునిచ్చింది.
మహాసభ ఆమోదించిన తీర్మానాలు
(1).సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ (ఓపీఎస్) పునరుద్ధరించాలి. పీఎఫ్ఆర్డీఏ చట్టం రద్దు చేయాలి.
(2).ఆదాయపు పన్ను పరిమితిని సవరించి, ఉద్యోగులపై భారాన్ని తగ్గించాలి.
3).ఎన్ఈపీ- 2020 రద్దు చేసి ప్రత్యామ్నాయ జాతీయ విద్యా విధానం తీసుకు రావాలి.
(4).విద్యా కేంద్రీకరణను ఆపాలి, పాఠశాలల మూసివేత, సిలబస్ తొలగింపును నిలిపివేయాలి.
(5).విద్యారంగానికి జీడీపీలో 6 శాతం, కేంద్ర బడ్జెట్లో 10శాతం నిధులు కేటాయించాలి.
(6).ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి.
(7).కాంట్రాక్ట్ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, బేసిక్ పే కల్పించాలి.
(8).ఉపాధ్యాయ ఖాళీలను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలి.
(9).కాంట్రాక్టు, గెస్ట్, అవర్ బేస్డ్, అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలి.
(10) ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ఇవ్వకుండా బోధనకే పరిమితం చేయాలి.
చావ రవి ఎన్నిక పట్ల హర్షం
సుదీర్ఘ కాలంగా జాతీయ స్థాయి ఉపాధ్యాయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న చావ రవి ఎస్టీఎఫ్ఐ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యుటిఎఫ్) హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.వెంకట్, ఉపాధ్యక్షులు సీహెచ్.దుర్గ భవాని, కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, కార్యదర్శులు శాంతి కుమారి, నాగమణి, రాజు, రంజిత్ కుమార్, సత్యానంద్, మల్లారెడ్డి, శ్రీధర్, రవి ప్రసాద్ గౌడ్, రవికుమార్, సింహాచలం, జ్ఞాన మంజరి, వెంకటప్ప తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు.