సస్పెన్షన్ను సవాల్ చేసిన మహిళా కోచ్
హైదరాబాద్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) వీసీ ఎండీ సోనీ బాలదేవి తనను కక్షపూరితంగా సస్పెండ్ చేశారని శాట్ కాంట్రాక్టు కోచ్ల సంఘం అధ్యక్షురాలు టీవీఎల్ సత్యవాణి హైకోర్టును ఆశ్రయించారు. మూడు దశాబ్దాలకు పైగా శాట్లో ఒప్పంద కోచ్లుగా పని చేస్తున్న తమ సర్వీస్ను క్రమబద్ధీకరించాలని చేస్తున్న న్యాయమైన డిమాండ్ను పట్టించుకోవడం లేదని ప్రశ్నించినందుకు తనను సస్పెండ్ చేశారని వాపోయారు. శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి నుంచి సీఎం రేవంత రెడ్డి వరకు ఈ-మెయిల్స్, మెసేజ్లు, వినతిపత్రాల ద్వారా ఈ సమస్యను తీసుకుపోతున్నామనే కక్షతో తనను అనైతికంగా సస్పెండ్ చేశారని సత్యవాణి ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను విన్నవించుకునేందుకు సమయం ఇవ్వడం లేదని బహిరంగంగా చైర్మన్ను ప్రశ్నించినందుకు తనపై వేటు వేశారని వాపోయారు. ఈ విషయంలో చైర్మన్ శివసేనారెడ్డికి వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పడంతో పాటు శాట్ ఇచ్చిన నోటీసులకు సంజాయిషీ కూడా ఇచ్చానని చెప్పారు. తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని వీసీ ఎండీకి చైర్మన్ శివసేనారెడ్డి తన ముందే ఫోన్ చేసి చెప్పినా ఆమె పెడచెవిన పెట్టి కాంట్రాక్టు కోచ్ల హక్కుల కోసం ప్రశ్నిస్తున్న తనపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత నవంబరు నుంచి శాట్ వీసీ-ఎండీ చుట్టూ తిరిగి, తప్పని పరిస్థితుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించానని తెలిపారు. ఒప్పంద కోచ్ల హక్కుల కోసం ప్రశ్నిస్తున్నందకే తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హైకోర్టులో శాట్ వీసీ ఎండీపై (డబ్ల్యూపీ 4567/2026) కేసు ఫైల్ చేశానని సత్యవాణి తెలిపారు.
శాట్పై కోచ్ న్యాయం పోరాటం
- Advertisement -
- Advertisement -



