సమ్మర్ వచ్చేసింది. మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. ఈ టైమ్లో సాలిడ్ ఫుడ్స్ కంటే డ్రింక్స్ తాగడానికే అందరూ ఇష్టపడతారు. అలాంటప్పుడు కార్బోనేటేడ్ డ్రింక్స్ కాకుండా హెల్దీ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు కొన్ని డ్రింక్స్ మనకి హెల్ప్ చేస్తాయి. అయితే వీటిని మనం ఇంట్లో ఉండే పదార్థాలతోనే తయారు చేసుకోవచ్చు. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. అలాంటి డ్రింగ్స్ గురించి తెలుసుకుందాం…
లస్సీ..
కావాల్సిన పదార్థాలు: పెరుగు – కప్పు, ఉప్పు – చిటికెడు, యాలకులు – రెండు, పుదీనా – మూడు ఆకులు, పంచదార – రెండు చెంచాలు, ఐస్ వాటర్ – అర గ్లాసు.
తయారీ విధానం: మిక్సీ జార్లో పెరుగు, ఉప్పు యాలకులు, పంచదార, పుదీనా ఆకులు వేయండి. రెండు ఐస్ క్యూబ్స్ కూడా వేసి బాగా బ్లెండ్ చేయాలి. దీనిని మంచి ఎండగా ఉన్నప్పుడు తాగండి. ఎంతో హాయిగా అనిపిస్తుంది.
పుదీనా, పుచ్చకాయ జ్యూస్
కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ ముక్కలు – కప్పు, పుదీనా ఆకులు – ఆరు, ఉప్పు – చిటికెడు, పంచదార లేదా తేనె – రుచికి తగినట్లుగా, నానబెట్టిన సబ్జా గింజలు – చెంచా
తయారీ విధానం: ముందుగా పుచ్చకాయ ముక్కల్లో నుంచి గింజల్ని తీసేయండి. వాటిని మిక్సీ జార్లో వేసి పుదీనా ఆకులు, ఉప్పు వేసి అరగ్లాసు నీరుపోసి మిక్సీ పెట్టండి. సాధారణంగా పంచదార వేయొద్దు. రుచిగా ఉండాలనుకుంటే కొద్దిగా పంచదార లేదా తేనె వేసుకోవాలి. దీనిని తాగితే హైడ్రేటెడ్గా ఉంటుంది. దాహం కూడా తీరుతుంది.
బాదం డ్రింక్
కావల్సిన పదార్థాలు: బాదం పౌడర్ – ఆరు (నానబెట్టాలి), జీడిపప్పు పొడి – నాలుగు స్పూన్లు, పంచదార – అరకప్పు, కొబ్బరి – అరకప్పు, యాలకుల పొడి – పావు చెంచా, గుమ్మడిగింజలు – చెంచా, దోసకాయ గింజలు – చెంచా, తెల్ల నువ్వులు – చెంచా.
తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో నువ్వులు, కొద్దిగా నీరు పోసి పాలలా మిక్సీ పట్టాలి. అందులోనే నానబెట్టిన బాదం వేసి, కొబ్బరి పాలు కూడా వేసి కలపాలి. వీటన్నింటిని మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టాలి. అందులోనే జీడిపప్పు పొడి, యాలకుల పొడి, గుమ్మడి గింజలు, దోసకాయ గింజలు, పంచదార కలిపి మిక్సీ పట్టండి. అంతే టేస్టీ బాదం జ్యూస్ రెడీ అయినట్లే. ఇందులో అవసరమనుకుంటే సబ్జా గింజలు కూడా వేయొచ్చు.
బెల్లం, చింతపండుతో..
కావాల్సిన పదార్థాలు: చింతపండు – నిమ్మకాయ పరిమాణంలో, బెల్లం – పావుకప్పు, పంచదార పొడి – పావు చెంచా, యాలకులపొడి – పావు చెంచా, నీరు – ఐదు గ్లాసులు, ఉప్పు – చిటికెడు, పచ్చకర్పూరం – చిటికెడు, నిమ్మరసం – సగం చెంచా.
తయారీ విధానం: చింతపండుని బాగా కడిగి నానబెట్టాలి. ఓ వెడల్పాటి గిన్నెలో ఐదు గ్లాసుల వేడి నీరు పోసి అందులో బెల్లం వేసి కరిగించండి. ఇప్పుడు అందులో చింతపండు రసం, యాలకుల పొడి, పచ్చ కర్పూరం, ఉప్పు వేసి కలపండి.
చివరగా, నిమ్మరసం వేయండి. అంతే.. హెల్దీ డ్రింక్ రెడీ అయినట్లే.



