జూమ్ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఓటు చోర్కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈనెల15లోపు పూర్తి చేసి ఏఐసీసీ కార్యాలయానికి పంపించాలని సూచించారు. శనివారం హైదరాబాద్లోని గాంధీభవన్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో కలిసి ఆయన జూమ్ సమావేశంలో మాట్లాడారు. దేశంలో బీజేపీ పెద్ద ఎత్తున ఓట్ చోర్ కార్యక్రమాన్ని నిర్వహించిందని చెప్పారు. దీంతోనే బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుబంధ సంఘంగా పని చేస్తున్నదని విమర్శించారు. ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ఓట్చోరీ విషయంలో అన్ని రకాల ఆధారాలతో బీజేపీ బండారాన్ని బయటపెట్టారని గుర్తు చేశారు. ఎంతో పకడ్బందీగా ఆధారాలు చూపించినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి స్పందన లేదని విమర్శించారు.
రాష్ట్రంలో సంతకాల సేకరణ కార్యక్రమానికి భారీ వర్షాలు కొంత అంతరాయం కలిగించాయని తెలిపారు. ఇప్పటి నుంచి ప్రతి గ్రామంలో సంతకాల సేకరణ చేపట్టాలని సూచించారు. గ్రామానికి కనీసం వంద మందితో సంతాకలు చేయించాలని కోరారు. ఓట్చోరీకి బీజేపీ ఏ విధంగా పాల్పడిందో ప్రతి గ్రామంలో ప్రజలకు వివరించాలని కోరారు. డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక శ్రద్ద వహించాలని చెప్పారు. మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ ఓటు చోరీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి కాంగ్రెస్ నాయకులు ఓటు హక్కు ఉన్న బూత్లో సంతకాల సేకరణ చేపట్టాలని సూచించారు. జూమ్ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ఆఫీసు బేరర్లు, కార్పొరేషన్ చైర్మెన్లు, అనుబంధ సంఘాల చైర్మెన్లు, అధికార ప్రతినిధులు, జిల్లా ఇన్చార్జీలు పాల్గొన్నారు.
ఓటు చోర్కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES