నవతెలంగాణ – సిరిసిల్ల : జిల్లా వ్యాప్తంగా తేదీ జూన్ 6 నుండి 19 వరకు జరుగుతున్న బడిబాట కార్యక్రమంలో పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతం పెంపొందించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి బాల, బాలిక తప్పనిసరిగా పాఠశాలల్లో ఎనరోల్ అయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో బడిబాట కార్యక్రమం నిర్వహణపై కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు, అంగన్వాడి ఆయా ఏఎన్ఎం వివోఏలు కలిసి ఒక టీమ్ గా ఏర్పడి ప్రతి ఇంటిని సందర్శించి పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలల్లో విద్యార్థులుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా బాలికల ఎనరొల్మెంట్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ నూతన ఉపాధ్యాయుల ద్వారా అందిస్తున్న మెరుగైన నాణ్యమైన విద్యా బోధన, వసతులు ఉచిత పుస్తకాలు యూనిఫామ్ మధ్యాహ్న భోజనం వివిధ పోటీ పరీక్షలు జేఈఈ నీట్ ఎంట్రన్స్ పరీక్ష కోచింగ్ డిజిటల్ క్లాస్ రూమ్ తరగతులు, విశాలమైన ప్లే గ్రౌండ్ మొదలగు వివరాలు తల్లిదండ్రులకు వివరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాల బాలికలు ఎక్కడ డ్రాప్ ఔట్ కాకుండా చూడాలని, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సైతం బడిబాట కార్యక్రమంలో పాల్గొంటూ బాలికలు ఎక్కడ విద్యకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని, తల్లిదండ్రులకు విద్య పట్ల ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యత పై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.
పదవ తరగతి ముగిసిన తర్వాత కూడా ఇంటర్ చదివేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి మండల సూపర్వైజర్ వారి పరిధిలో గల బాలికల పై శ్రద్ధ వహిస్తూ వారు చదువు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు పట్టణాలలో వార్డు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడ బాల కార్మికులు తప్పకుండా చర్యలు తీసుకోవాలని, పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలలో నమోదు కావాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు, హోటల్స్, ఇట్టుక బట్టిలను తనిఖీ చేసి ఎవరైనా బాల కార్మికులు కనిపిస్తే వారిని వెంటనే పాఠశాలల్లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. వలస కూలీల పిల్లలు సైతం పాఠశాలలో నమోదయ్యేలా జాగ్రత్త వహించాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీల కింద నమోదై జాబ్ కార్డ్ కలిగిన ప్రతి కుటుంబంలో పిల్లలు చదువుకుంటున్నారో లేదో పరిశీలించాలని, పిల్లలు చదువుకొని పక్షంలో వెంటనే వారిని ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులుగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో డి ఆర్ డి ఓ శేషాద్రి, జిల్లా వైద్య అధికారి రజిత ,విద్యాశాఖ అధికారులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బడిబాటపై రివ్యూ నిర్వహించిన కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES