తెలంగాణ – కల్వకుర్తి టౌన్
కల్వకుర్తి మండల పరిధిలోని తర్నికల్ గ్రామ శివారులో ఉన్న బాలాజీ జిన్నింగ్ మిల్లును నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, సందర్శించి కొనుగోలు ప్రక్రియను మంగళవారం పరిశీలించారు. పత్తి కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిన్నింగ్ మిల్లుల యజమానులు కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. అకాల వర్షాల వలన ప్రస్తుత పత్తి కొనుగోలు సీజన్కు సంబంధించిన ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని, రైతులకు సరైన మద్దతు ధర (ఎంఎస్పి) చెల్లింపులో పారదర్శకత ఉండాలని ఆయన పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రాల వద్ద తగిన సౌకర్యాలు కల్పించడంతో పాటు తూకం, చెల్లింపు ప్రక్రియలను సక్రమంగా నిర్వహించాలన్నారు. మద్దతు ధరలకు పత్తి కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు అన్ని సదుపాయాలు అందేలా చూడాలని ఆయన సూచించారు. సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు మరియు సంబంధిత అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి పత్తి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, పారదర్శకంగా, వేగంగా కొనుగోలు ప్రక్రియ సాగేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులకు సూచించారు. సీసీఐ అధికారులు మరియు మిల్లుల యజమానులు రైతులకు తగిన మద్దతు ధర చెల్లించడం, తేమ శాతం పరిశీలనలో నిబంధనలు పాటించడం, బరువు తూకం పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట కల్వకుర్తి తహసిల్దార్ ఇబ్రహీం, జిన్నింగ్ మిల్లు అధికారులు తదితరులు ఉన్నారు.



