వరదబాధితులకు సాయం చేయండి
ప్రభుత్వోద్యోగుల సెలవులు రద్దు
ముంపు ముప్పు నివారించండి
ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించండి
ధాన్యం తడవొద్దు…జాగ్రత్తలు తీసుకోండి
సహాయచర్యల్లో డ్రోన్లను వాడుకోవాలి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం ఆదేశాలు
నేడు వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే
ఇన్చార్జి మంత్రులకు సహాయక చర్యల భాద్యతలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తుపాన్ ప్రభావిత జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా చూడాలనీ, పశువులకు ఆపద రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, పరిస్థితుల్ని అంచనా వేస్తూ నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లోని ప్రజల్ని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి కావల్సిన ఏర్పాట్లు చూడాలని చెప్పారు. గురువారంనాడాయన హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని 16 జిల్లాల్లో తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లాల్లో ప్రధానంగా వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లిందని మంత్రులు, కలెక్టర్లు ముఖ్యమంత్రికి వివరించారు. ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాతో పాటు, హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద నష్టం ఎక్కువగా ఉందని అంచనా వేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వరి కోతలు మొదలయ్యాయనీ, అనుకోని ఉపద్రవం వస్తే రైతులకు ఆవేదన మిగులుతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈసారి 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందనీ, అందుకు తగ్గట్టు పౌరసరఫరాలశాఖ కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలన్నారు. వరద తగ్గిన తర్వాత వ్యవసాయ, రెవెన్యూ విభాగం అధికారులు సంయుక్తంగా సర్వే చేసి, నష్టం అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు. రహదారుల పునరుద్ధరణ, ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా ఇంచార్జ్ మంత్రులు సమీక్షించాలని సీఎం కోరారు.
పోలీసుల సేవలు వినియోగించుకోండి
వరంగల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలీసుల సేవలను వినియోగించుకోవాలనీ, అవసరమైతే హైదరాబాద్ నుంచి హైడ్రా సిబ్బందితో పాటు సామాగ్రిని పంపించాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. తక్షణ సహాయక చర్యల నిమిత్తం అవసరమైనన్ని పడవలు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని పంపాలని చెప్పారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఇప్పటికే 9 రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేసి, రెండు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. వరదల్లో ఎక్కడైనా ఇండ్ల కప్పులు, బంగ్లాలపై చిక్కుకున్న కుటుంబాలను గుర్తించి డ్రోన్ల ద్వారా తాగునీరు, ఆహార పొట్లాలు అందించాలని సీఎం సూచించారు.
నేడు సీఎం ఏరియల్ సర్వే
వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో శుక్రవారం సీఎం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలు, పంట నష్టం వాటిల్లిన ప్రాంతాలను పరిశీలిస్తారు. గురువారం ఉదయమే వరద ప్రభావిత జిల్లాలకు వెళ్లేందుకు రేవంత్రెడ్డి సిద్ధమయ్యారు. వాతావరణం అనుకూలించకపోవటంతో హెలికాప్టర్ ప్రయాణం వీలు కాదని ఏరియల్ సర్వేకు అధికారులు అనుమతించలేదు. దీనితో చివరి నిమిషంలో పర్యటన రద్దయింది.
ధాన్యాన్ని గోదాములకు తరలించండి
ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే దగ్గర్లోని గోదాములు, మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. అవి అందుబాటులో లేని చోట దగ్గరలో ఉన్న ఫంక్షన్ హాళ్లలో నిల్వ చేయాలని సూచించారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికో ఇన్చార్జి అధికారిని నియమించాలని సూచించారు. ఐకేపీ సెంటర్ల నుంచి ప్రతిరోజూ నివేదికలు తెప్పించుకోవాలనీ, నిర్లక్ష్యం వహించే అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ‘వర్షాలకు ధాన్యం తడవకుండా తగినన్ని టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి. విధానపరమైన నిర్ణయాలను అవసరమైతే సివిల్ సప్లయిస్ కమిషనర్, సీఎస్ దృష్టికి తీసుకురావాలి. అధికారులు, ఉద్యోగుల సెలవులు రద్దు చేసి అందరూ ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలి’ అని సీఎం అన్నారు.
విద్యుత్కు అంతరాయం లేకుండా చర్యలు
వర్షాలు, ఈదురు గాలులతో విద్యుత్ అంతరాయం ఏర్పడితే, వెంటనే పునరుద్ధరించేలా విద్యుత్ శాఖ చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఖమ్మం జిల్లాలో డీసీఎం వ్యాన్, డ్రైవర్ వాగులో కొట్టుకుపోవటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, రహదారులపై ఉన్న బ్రిడ్జీలు, లో లెవల్ కాజ్ వేలు, కల్వర్టుల వద్ద అప్రమత్తంగా ఉంటే ఇలాంటి ఘటనలను నివారించవచ్చన్నారు. రోడ్లు, రహదారులపైకి వరద వచ్చే ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. స్థానిక పోలీస్, రెవెన్యూ అధికారులు వాహనాలు అటువైపు వెళ్లకుండా ఇరువైపులా బారికేడ్లు పెట్టాలన్నారు. దెబ్బతిన్న రోడ్ల వద్ద ట్రాఫిక్ను డైవర్ట్ చేయాలనీ, కుంభ వృష్టి కురిసే సమయంలో అవసరమైతే తప్ప ప్రజలు రోడ్లపైకి రాకుండా అవగాహన కల్పించాలని సూచించారు.
వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలనీ, అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరంగల్ జిల్లాలో 24 గంటలు పరిస్థితిని పర్యవేక్షించేందుకు వీలుగా కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలోనూ కమాండ్ కంట్రోల్ సెంటర్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఓఎస్డీ వేముల శ్రీనివాసులు. విపత్తుల నిర్వహణ విభాగం స్పెషల్ సెక్రెటరీ అరవింద్ కుమార్, హైదరాబాద్ జలమండలి ఎండీ అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



