- పారిశుధ్యం, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి
- ఇటీక్యాలలో నిర్మాణ పనుల తనిఖీ
- నవతెలంగాణ – రాయికల్
- జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మంగళవారం రాయికల్ మండలంలో పర్యటించారు. మండల కేంద్రంలో పారిశుధ్య పరిస్థితులను పరిశీలించి, చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, మార్కెట్ ప్రాంతాలు, ప్రజా ప్రదేశాల్లో జరుగుతున్న శుభ్రత కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. ఎక్కడా చెత్త పేరుకుపోకుండా నిరంతరం శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. పట్టణ ప్రజలకు శుభ్రమైన,ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు పారిశుధ్య పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
అనంతరం మండలంలోని ఇటిక్యాల గ్రామాన్ని సందర్శించిన ఆయన అక్కడ నిర్మాణ దశలో ఉన్న హెల్త్ సబ్ సెంటర్, అంగన్వాడి కేంద్రం, జెడ్పిహెచ్ఎస్ పాఠశాల భవనాల పనులను పరిశీలించారు. పనుల నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు త్వరితగతిన ఆరోగ్య, విద్యా సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్య, పోషకాహార సేవలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
పనుల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ సమయపాలనతో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ కె.రాము, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీఓ చిరంజీవి, మున్సిపల్ చైర్మన్ కట్కం రవి, ఇటిక్యాల సర్పంచ్ నీరటి శ్రీనివాస్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.



