– జైరాం రమేష్
న్యూఢిల్లీ : విదేశాలకు వెళ్లే అఖిలపక్ష దౌత్య ప్రతినిధుల బృందం కోసం కేంద్రం పేర్లు అడగలేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెబుతున్న మాటలు అబద్ధమని కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్ స్పష్టం చేశారు. ఈ విషయంలో బిజెపి ప్రభుత్వం చౌకబారు రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేష్ ఈ విషయాన్ని తెలిపారు. ‘కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేసి మాట్లాడే మర్యాద ప్రధానికి ఎందుకు లేదు’ అని ప్రశ్నించారు. ఈ నెల 16న ఖర్గే, రాహుల్ గాంధీతో కిరణ్ రిజిజు మాట్లాడారని, ఈ తరువాతే నాలుగు పేర్లును సూచిస్తూ రిజిజుకు రాహుల్ లేఖరాసారని తెలిపారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ ఐక్యత, సంఘీభావం ముఖ్యమని చెబుతుందని, బిజెపి ద్వేషాన్ని-మతతత్వాన్ని వ్యాప్తి చేస్తోందని విమర్శించారు. అలాగే, సోమవారం జైరాం రమేష్ మరోక ట్వీట్ చేశారు. ఇందులో ’11 ఏళ్లుగా ప్రతిపక్షాలను ముఖ్యంగా కాంగ్రెస్ను మోడీ విమర్శిస్తూ వస్తున్నారు.
కానీ ఇప్పుడు అఖిల పక్ష బృందం కోసం కాంగ్రెస్ సహాయాన్ని మోడీ తీసుకుంటున్నారు’ అని ఎద్దేవా చేశారు. మోడీ విశ్వ గురు బెలూన్ పేలిపోయిందని విమర్శించారు. కాగా, పాకిస్తాన్ ప్రొత్సహిస్తున్న ఉగ్రవాదంపై భారతదేశ వైఖరిని వివరించడం కోసం విదేశాలకు పంపే అఖిలపక్ష ప్రతినిధుల బృందం కొరకు నలుగురు నాయకులు పేర్లను సమర్పించాలని ప్రభుత్వం కోరిందని శనివారమే కాంగ్రెస్ తెలిపింది. ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోరు, సయ్యద్ నాసీర్ హుస్సేన్, అమరీందర్ సింగ్ రాజా వారింగ్ పేర్లను ప్రతిపాదించినట్లు కూడా తెలిపింది. అయితే వీరిలో ఆనంద్ శర్మను మాత్రమే బృందంలోకి తీసుకుంది. పైగా కాంగ్రెస్ పంపిన జాబితాలో లేని ఆ పార్టీ నాయకులు శశిథరూర్, మనీష్ తివారీ, అమర్ సింగ్, సల్మాన్ ఖుర్షీద్లను బృందంలోకి తీసుకుంది.
కిరణ్ రిజిజు వ్యాఖ్యలు అబద్ధం
- Advertisement -
- Advertisement -