మూడేండ్లలో పూర్తి స్థాయి వసతులతో కల్పించాలి
నర్సింగ్ కళాశాలల్లో ఆప్షనల్గా జపనీస్ ఉండాలి : వైద్యారోగ్య సమీక్షలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి
ప్రతీ నెలా వైద్యారోగ్య, విద్యా శాఖలపై సమీక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో పని చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వెంటనే తయారు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలనీ, ఆ కమిటీ ప్రతి కళాశాలను సందర్శించి అక్కడి అవసరాలు, వాటికి అవసరమయ్యే నిధులు, తక్షణమే పూర్తి చేయాల్సిన పనులు, ప్రభుత్వపరంగా అందించాల్సిన సహాయం తదితర వివరాలతో నివేదికను సమర్పించాలని సీఎం ఆదేశించారు. వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఐసీసీసీలో సోమవారం ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) రాష్ట్రంలోని వైద్య కళాశాలలకు సంబంధించి లేవనెత్తిన పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నియామకాలు, బోధన సిబ్బందికి ప్రమోషన్లు, వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో పడకల పెంపు, ఆయా కళాశాలలకు అవసరమైన వైద్య పరికరాలు, ఖాళీల భర్తీపై సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయాల్సిన నిధులను వెంటనే విడుదల చేస్తామని తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి నిధులు, అనుమతులకు సంబంధించిన అంశాలుంటే వెంటనే తెలియజేయాలనీ, కేంద్ర మంత్రి నడ్డా, ఆ శాఖ అధికారులను సంప్రదించి వాటిని పరిష్కరిస్తామని సీఎం పేర్కొన్నారు. నర్సింగ్ కళాశాలల్లో జపనీస్ (జపాన్ భాష)ను ఒక ఆప్షనల్గా నేర్పించాలనీ, జపాన్లో మన నర్సింగ్ సిబ్బందికి డిమాండ్ ఉందని సీఎం తెలిపారు. ఈ విషయంలో మనకు మద్దతిచ్చేందుకు జపాన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం వెల్లడించారు. ఆస్పత్రులకు వచ్చే రోగులు, వారిని పరీక్షించే వైద్యులు, ఆస్పత్రుల సమయాల పర్యవేక్షణకు ఒక యాప్ను వినియోగించే అంశంపై అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. విద్య, వైద్య రంగాలు ఎంతో కీలకమనీ, ప్రతి నెలా మూడో వారంలో ఈ రెండు శాఖలపై సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్రాజ్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టీనా జడ్ చోంగ్తూ, వైద్యవిద్య సంచా లకులు డాక్టర్ నరేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వైద్య కళాశాలల్లో క్షేత్ర స్థాయి పరిశీలనకు అధికారులతో కమిటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES