– ఉగ్రవాదాన్ని అణచివేసే సర్వాధికారాలు వారికే : ప్రధాని మోడీ ప్రధానితో
– ఆర్ఎస్ఎస్ చీఫ్ భేటీ
న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్ ఏ విధంగా స్పందించాలనే విషయమై సాయుధ బలగాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు ప్రధాని మోడీ మంగళవారం ప్రకటించారు. ఏ సమయంలో ఎలా స్పందించాలి, లక్ష్యాలేమిటి అనే విషయమై నిర్ణయం తీసుకునేందుకు సైన్యానికి పూర్తి నిర్వహణాపరమైన స్వేచ్ఛ వుంటుందని తెలిపారు. సర్వాధికారాలు వారికే అప్పగించినట్లు తెలిపారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలన్నది జాతీయస్థాయిలో తీసుకున్న ఏకగ్రీవ తీర్మానమని పేర్కొన్నారు. భారత సాయుధ బలగాల శక్తి సామర్ధ్యాల పట్ల తమకు పూర్తి స్థాయి విశ్వాసం వుందని పేర్కొన్నారు.
పహల్గాం దాడి అనంతరం సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఢిల్లీలోనూ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని మోడీ నివాసంలో మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు. దాదాపు గంటన్నరపాటు సాగిన ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల అధిపతులతో సహా ఉన్నత స్థాయి రక్షణ శాఖ అధికారులు పాల్గొన్నారు. దేశంలో అంతర్గత భద్రతతో పాటు సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు.
ఉగ్రవాదాన్ని అణచివేయడం జాతీయ సంకల్పమని ఈ సందర్భంగా ప్రధాని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం దృఢనిశ్చయంతో వుందన్నారు. పహల్గాం దాడికి దీటైన బదులిస్తామని ప్రధాని తెలిపారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ రూపొందించుకోవడంలో భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని, ఎప్పుడు, ఎక్కడ ఎలా స్పందించాలో, ఏ లక్ష్యాలపై దాడులు జరపాలో అంతా సైన్యమే నిర్ణయం తీసుకుంటుందని మోడీ స్పష్టం చేశారు. సమావేశం అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రధానితో భేటీ అయ్యారు. ఉగ్రవాదంపై తీసుకోవాల్సిన చర్యల గురించి వారిద్దరూ చర్చించినట్టు సమాచారం.
కేంద్ర హోంశాఖలో ఉన్నత స్థాయి సమావేశం
మరోవైపు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, బిఎస్ఎఫ్. అస్సాం రైఫిల్స్ జాతీయ భద్రతా దళం డైరెక్టర్ జనరల్స్ పాల్గొన్నారు. సిఐఎస్ఎఫ్, కేంద్ర రిజర్్వ పోలీసు బలగాల సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న తాజా పరిణామాలపై ఆ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
సైన్యానికి పూర్తి స్వేచ్ఛ
- Advertisement -