నాటో సెక్రెటరీ జనరల్ ఆరోపణలను ఖండించిన భారత్
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ ద్వారా రష్యా అధ్యక్షులు పుతిన్తో సంభాషించారని, ఉక్రెయిన్పై వ్యూహాన్ని వివరించాలని అడిగారని నాటో సెక్రెటరీ జనరల్ మార్క్ రూట్టే చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. ఈ ఆరోపణలు ‘నిజంగా తప్పు, పూర్తిగా నిరాధారం’ అని పేర్కొంది. ముఖ్యమైన సంస్థ అయిన నాటోకు నాయకత్వం వహిస్తున్న వారు మరింత బాధ్యత, బహిరంగ ప్రకటనల్లో కచ్చితత్వం ప్రదర్శిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపింది. ఇటీవల జరిగిన ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రూట్టే మీడియాతో మాట్లాడుతూ ‘భారత్పై అమెరికా సుంకాలు పెంచిన తరువాత ప్రధాని మోడీ పుతిన్తో మాట్లాడారు. రష్యాకు భారత్ మద్దతు ఇస్తుంది కాబట్టే తమపై సుంకాలను విధించారని,. అందువలన ఉక్రెయిన్పై రష్యా వ్యూహాన్ని వివరించమని అడిగారు’ అని తెలిపారు. దీపై కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. రూట్టే చేసిన వ్యాఖ్యలు తమ దృష్టికి వచ్చాయని, ప్రధాని మోడీ ఎప్పుడూ పుతిన్తో ఆ విధంగా మాట్లాడలేదని స్పష్టం చేసింది. ప్రధానమంత్రి వ్యాఖ్యలను తప్పుగా సూచించడం, జరగని చర్చలను జరిగినట్టుగా సూచించే ఊహజనిత, బాధ్యతలేని వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని విదేశాంగ శాఖ పేర్కొంది. ‘ఇప్పటికే చెప్పినట్లుగా.. దేశ ఇంధన దిగుమతులు భారత వినియోగదారునికి సరసమైన ఇంధన ఖర్చులను నిర్ధారించడానికి ఉద్దేశించినవి. భారత్ తన జాతీయ ప్రయోజనాలను, ఆర్థిక భద్రతను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది’ అని విదేశాంగ శాఖ తెలిపింది.
పూర్తిగా నిరాధారం
- Advertisement -
- Advertisement -