– క్యూలో చెప్పులు, పాసుబుక్కులు
నవతెలంగాణ – విలేకరులు
యూరియా దొరక్కపోవడంతో మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని రైతు వేదిక వద్ద రైతులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం అల్వాల గ్రామ రైతు వేదిక వద్ద యూరియా వచ్చిందని తెలవడంతో, ఉదయం నాలుగు గంటల నుంచి రైతులు పాసుబుక్కులు లైన్లో పెట్టారు. కొంతమంది రైతులు ఖాళీ మద్యం సీసాలు పాస్బుక్లపై పెట్టి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ప్రతి గ్రామంలోనూ మద్యం ఏరులై పారుతోంది కానీ.. రైతులు పండించే పంటకు యూరియా కావాలంటే మాత్రం దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారులను రైతు వేదికలో నిర్బంధించి ఆందోళన చేశారు. ఒక్కసారిగా రైతులు యూరియా కోసం తోసుకురావడంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అదేవిధంగా రాయపోలు మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలోనూ యూరియా కోసం రైతులు ఎక్కువ సేపు క్యూలో ఉండలేక చెప్పులను లైన్లో పెట్టారు.
మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో రైతు సేవాసహకార సంఘం దగ్గర యూరియా కోసం రైతులు ఉదయం నుంచి బారులు కట్టారు. చాలీచాలకుండా యూరియా రావడంతో తాండూర్-మహబూబ్నగర్ ప్రధాన రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఖమ్మం జిల్లా కారేపల్లిలో యూరియా కోసం రైతులు రోడెక్కారు. కొమరంభీం సెంటర్లో బైౖటాయించారు. రైతుల అందోళనకు సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కె.నరేంద్ర మద్దతు తెలిపారు. కారేపల్లి ఎస్ఐ బైరు గోపి రైతులతో మాట్లాడి వారిని సముదాయించారు. అక్కడకు మండల వ్యవసాయాధికారి బట్టు అశోక్కుమార్ వచ్చి రైతులతో మాట్లాడారు. యూరియా కోసం ఉన్నతాధికారులతో మాట్లాడారు. 15 టన్నుల యూరియా ఆదివారం కారేపల్లి సొసైటీకి రప్పించే ఏర్పాట్లు చేస్తున్నట్టు ఏవో తెలిపారు. దానిని ఆదివారమే పంపిణీ చేపడుతామని హామీ ఇచ్చారు.