నవతెలంగాణ – భువనగిరి: తెలంగాణ హైకోర్టు గౌరవ న్యాయమూర్తి శ్రీమతి ఎంజీ ప్రియదర్శి అకాలమరణం న్యాయ రంగానికి తీరని లోటు అని ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడి వెంకటరెడ్డి అన్నారు. ఆమె జిల్లా న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఎనలేని సేవలందించి, న్యాయవ్యూహాలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేవడంలో తనదైన ముద్ర వేసారన్నారు. ఇటీవల కాలంలో ఆమె హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిని పొందడం న్యాయ రంగానికి గర్వకారణంగా నిలిచిన సందర్భంలోనే, ఆమె అకాల మరణం వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. న్యాయమూర్తిగా ఆమె చేసిన సేవలు, ఆమె తీర్పులు న్యాయవ్యవస్థ పట్ల నమ్మకాన్ని బలపరిచినవే కాక, సమాజంపై సానుకూల ప్రభావం చూపినవిగా నిలిచాయన్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరఫున ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. ఆమె న్యాయ సేవలు చిరస్మరణీయమవుతాయని, న్యాయవాదుల హృదయాల్లో ఆమె స్మరణ శాశ్వతంగా నిలిచిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐలు జిల్లా గౌరవాధ్యక్షులు కుక్కదువ్వ సోమయ్య, అధ్యక్షులు బోల్లెపల్లి కుమార్, ఉపాధ్యక్షులు తడక మోహన్, పాల్వంచ జగతయ్య, ఎండీ నేహాల్, సహాయ కార్యదర్శి శ్రీహరి, సీసా శ్రీనివాస్, చింతల రాజశేఖర్ రెడ్డి, కోశాధికారి బొడ్డు కిషన్, పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి మృతి పట్ల సంతాపం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES