నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని పీఎం శ్రీ కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులను మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య అభినందించారు. నిజామాబాద్ జిల్లా తీర్మాన్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన సీఎం కప్ నెట్ బాల్ క్రీడా పోటీలలో బాలికల విభాగంలో కోన సముందర్ పాఠశాల విద్యార్థులు జిల్లాలో ద్వితీయ స్థానం సాధించారు. అదేవిధంగా పీఎం శ్రీ పాఠశాలల విభాగంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా క్రీడ అసోసియేషన్ మైదానంలో జరిగిన కబడ్డీ పోటీలలో పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించారు.
ఈ నేపథ్యంలో బుధవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో నెట్ బాల్, కబడ్డీ పోటీలలో గెలుపొందిన విద్యార్థి క్రీడాకారులను, కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయుడు బి.రమేష్ గౌడ్ ను మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో ఉన్నంతంగా రాణించి భవిష్యత్తులో పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బద్రి మధుపాల్, బషీరాబాద్ ప్రధానోపాధ్యాయులు కే.గంగాధర్, హాసకోత్తూర్ కృష్ణ కుమార్, చౌట్ పల్లి బంతిలాల్, కోన సముందర్ పాఠశాల ఉపాధ్యాయుల బృందం, తదితరులు పాల్గొన్నారు.



