Monday, December 29, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపాలమూరు రంగారెడ్డిపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పచ్చి అబద్ధాలు

పాలమూరు రంగారెడ్డిపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పచ్చి అబద్ధాలు

- Advertisement -

బడ్జెట్‌లో సగం ఖర్చు చేయకుండా 90 శాతం పనులు ఎలా సాధ్యం
రెండేండ్లలో పెద్దపీట వేస్తే… పనులు ఎందుకు పూర్తి కాలేదు
భూ నిర్వాసితులకు వెంటనే న్యాయమైన పరిహారం చెల్లించాలి : సీపీఐ (ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ


నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
‘పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ఖర్చు చేయాల్సిన రూ.74 వేల కోట్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేండ్లలో కేవలం రూ. 32 వేల కోట్లు ఖర్చు చేసి 90 పనులు పూర్తి చేశామని మాజీ సీఎం కేసీఆర్‌ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో పాలమూరు రంగారెడ్డికి పెద్దపీట వేశామని చెప్పడం హస్యాస్పదంగా ఉంది. పెద్ద పీట వేస్తే ప్రాజెక్టు పనులు ఎందుకు పూర్తి కాలేదు. ఇరు పార్టీల నాయకులు పాలమూరు ప్రాజెక్టుల విషయంలో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికైనా పాలమూరు బీడు భూములకు సాగునీరు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టును యుద్ద ప్రాతిపదిక పూర్తి చేయాలి. అశాస్త్రీయ పద్ధతిలో మాట్లాడటం సరికాదు. పారదర్శకతతో పనులు పూర్తి చేయకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు’ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రశ్నించారు.

ఆదివారం మహబూబ్‌నగర్‌లోని సీపీఐ(ఎం) కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాన డిస్ట్రిబ్యూటర్లు, చిన్న కాల్వలు మొదలే కాలేదని, ప్రధాన కాల్వలే పూర్తి చేయకుండా బీళ్లకు నీళ్లు ఎలా పారుతాయని ప్రశ్నించారు. నిర్దిష్టమైన సమయం పెట్టుకొని ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు. భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇచ్చి వారిని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. పాలమూరు వంటి వలసల జిల్లా ఆకలని తీర్చే ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం నిర్వీర్యం చేసేందుకు వీబీ జీ రామ్‌ జీ పేరిట పథకాన్ని తెచ్చిందన్నారు. ఈ బిల్లు ద్వారా చేసిన పనులకు 40 శాతం నిధులు పంచాయితీలే భరించేలా నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు.

కార్మికులను అభద్రతకు గురిచేసే విధంగా నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చిందన్నారు. రైతుల భూములను కార్పొరేట్లకు అప్పగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. కేంద్రం వెంటనే నిధులు పెంచి గ్రామ పంచాయితీల ఖాతాలో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ విషయంలో ప్రభుత్వం పాత విధానాలను అమలు చేసి న్యాయం చేయాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో చర్చలకే పరిమితం కాకుండా కేంద్రంపై పోరాటాలకు సీఎం రేవంత్‌రెడ్డి అఖిలపక్షాన్ని పిలవాలని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పి.జయలక్ష్మి, జిల్లా కార్యదర్శి ఎ. రాములు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కిల్లె గోపాల్‌, కురుమూర్తి, పద్మ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -