Wednesday, September 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅబద్ధాల పునాదుల మీద అధికారంలోకొచ్చిన కాంగ్రెస్‌

అబద్ధాల పునాదుల మీద అధికారంలోకొచ్చిన కాంగ్రెస్‌

- Advertisement -

మోసమే ఆ పార్టీ నైజం
పొంగులేటికి లక్కీలాటరీలా మంత్రి పదవి
పాలేరు మళ్లీ ఎలా గెలుస్తారో చూద్దాం :భద్రాచలం ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అబద్ధాల పునాదుల మీదే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. మోసమనేది ఆ పార్టీ నైజమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన భద్రాచలం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్‌ మోసాన్ని ప్రజలకు వివరించడంలో తాము విఫలమయ్యామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చెప్పుకోలేకపోయామని తెలిపారు. కాంగ్రెస్‌ ఇప్పుడు చేస్తున్న తీరుగా అప్పుడు ప్రతిపక్షాలను తాము అణచివేసి ఉంటే, ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా కాంగ్రెస్‌కు నాయకులు దొరక్కపోయేవారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యేలు ఎందుకు పిరికివాళ్లుగా మారిపోయారో చెప్పాలని అన్నారు.

వారి విషయంలో సీఎంకు నిజంగా ధైర్యముంటే… పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు పోవాలంటూ సవాల్‌ విసిరారు. గత దీపావళికి ‘బాంబులు పేలబోతున్నాయి…’ అంటూ మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారని కేటీఆర్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు మళ్ళీ దీపావళి వచ్చిందని, అయితే ఇంకా బాంబులే పేలలేదని ఎద్దేవా చేశారు. తంతే గారెల బుట్టలో పడ్డట్టు పొంగులేటికి లక్కీలాటరీలాగా మంత్రి పదవి దక్కిందని ఎద్దేవా చేశారు. అహంకారంతో మాట్లాడుతున్న ఆయన మళ్లీ పాలేరులో గెలవగలరా? అని ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -