Friday, February 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅక్రమ కేసులు బనాయించిన కాంగ్రెస్‌

అక్రమ కేసులు బనాయించిన కాంగ్రెస్‌

- Advertisement -

ఆదిలాబాద్‌లో పర్యటించిన హరీశ్‌రావు
బాల్కసుమన్‌తో ములాఖత్‌
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌

అధికార పార్టీ నాయకులు దాడులు చేసి మరీ బీఆర్‌ఎస్‌ నాయకులపై అక్రమ కేసులు బనాయించారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకుల వినాశకాలే విపరీతబుద్ధి అని అన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపల్‌ చైర్మెన్‌ ఎన్నిక సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులో చెన్నూర్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి ఆదిలాబాద్‌ జైలుకు బుధవారం రాత్రి 11.30 ప్రాంతంలో తరలించారు. బాల్క సుమన్‌తో పాటు మరో నలుగురిపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం వారిని జిల్లా జైలులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్సీ శంబిపూర్‌ రాజు, మాజీ మంత్రి జోగు రామన్న, ఆసిఫాబాద్‌, బోథ్‌ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మీ, అనిల్‌ జాదవ్‌, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌, దుర్గం చిన్నయ్య, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ములాఖత్‌ అయ్యారు.

ముందుగా మావల వద్ద బీఆర్‌ఎస్‌ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ క్యాతన్‌పల్లి మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు అక్కడి ప్రజలు 22 సీట్లకు గాను 14 సీట్లు ఇచ్చారని తెలిపారు. దీన్ని అధికార కాంగ్రెస్‌ జీర్ణించుకోలేక మంత్రి వివేక్‌ కనుసైగల్లో అధికార యంత్రాంగం పని చేస్తూ మొదటి రోజు కాంగ్రెస్‌ శ్రేణుల గొడవ కారణంగా చైర్మన్‌ ఎన్నిక వాయిదా వేశారన్నారు. రెండవ రోజు సైతం అదే సీన్‌ రీపిట్‌ చేసి మహిళా కౌన్సిలర్లపై దుర్భాషలాడారని ఆరోపించారు. అక్కడే ఉన్న అధికారులు, మంత్రి కూడా మహిళలకు మద్దతుగా మాట్లాడకపోవడం సిగ్గు చేటన్నారు. ఆసిఫాబాద్‌, లక్షెట్టిపేట, రామగుండం కమిషనరేట్‌ పరిధిలో పెద్దపెల్లిలో జైలు ఉన్న కూడా రెండు వందల కిలోమీటర్లు ఉన్న ఆదిలాబాద్‌ జైలుకు తరలించారన్నారు. ఇది కేవలం రాజకీయ కుట్రలో భాగమేనని తెలిపారు. బాల్కసుమన్‌ ఉద్యమ నాయకుడని, ఆయనకు జైలు, కేసులు కొత్తేమీ కాదన్నారు. ఇంత జరిగినా ఎన్నికల కమిషన్‌ చోద్యం చూస్తోందా? అని ప్రశ్నించారు. పోలీసులు తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఉద్రిక్తత వాతావరణం
ముఖ్య నాయకుల రాక సందర్భంగా జిల్లా జైలు ఎదుట పోలీసులు గురువారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం జైలుకు చేరుకున్న హరీశ్‌రావు నాయకులతో కలిసి జైలులో లీగల్‌ టీం సభ్యులతో పాటు కలిసి వివరాలను తెలుసుకున్నారు. వారితో పాటు నాయకులు లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు నాయకులకు మధ్య తోపులాట జరగగా స్వల్ప ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అనంతరం జైలు గేటు ఎదుట నాయకులు బైఠాయించి బాల్క సుమన్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -