2 నుంచి 18కి పెరిగిన సీట్లు
చతికిలపడిన బీఆర్ఎస్.. ఒక్క సీటుకే పరిమితం
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమరం.. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. టీపీసీసీ అధ్యక్షులు మహేశ్కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో పాటు ఇక్కడ బీజేపీ బలంగా ఉండటంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 22 ఏండ్లుగా అర్బన్లో ప్రాతినిధ్యం లేకుండా ఉన్న కాంగ్రెస్.. తన స్థానాలను 2 నుంచి 18కి పెంచుకుంది. బీఆర్ఎస్ పార్టీ చతికిల పడింది. గతంలో 16 స్థానాల్లో గెలుపొందగా ఈసారి ఒక్క స్థానానికే పరిమితం అయ్యింది. కాగా బీజేపీ గత ఎన్నికల్లో పొందిన స్థానాలను కాపాడుకుంది. 28 డివిజన్లు గెలిచి కార్పొరేషన్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మైనార్టీ ఏరియాల్లో ఎంఐఎం తన ప్రభావం చూపుకుంది. 14 స్థానాల్లో గెలుపొందింది. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో 22 ఏండ్లుగా కాంగ్రెస్కు ప్రాతినిధ్యమే లేదు. దీని ప్రభావం మున్సిపల్ ఎన్నికల్లో పడుతూ వచ్చింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. వీటిల్లో కాంగ్రెస్ పార్టీ 17, బీజేపీ 28, ఎంఐఎం 14, బీఆర్ఎస్ పార్టీ 1 స్థానం కైవసం చేసుకున్నాయి. మేయర్ స్థానానికి అవసరమైన మెజార్టీ ఏ పార్టీకి రాలేదు. దాంతో ఎంఐఎం కింగ్ మేకర్ అయ్యింది. అయితే కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఏరియాలతో పాటు మెజార్టీ కాలనీల్లో తన ప్రాబల్యం పెంచుకుంది. కాగా, మేయర్ స్థానం కోసం ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దాంతో ఎంఐఎం మద్దతు కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ రెండు పార్టీలు కలిస్తే మ్యాజిక్ ఫిగర్ 31కి చేరుకోనుంది. అదే విధంగా బీజేపీకి ఇక్కడ 5 ఎక్స్అఫిషియో ఓట్లు ఉన్నాయి. కాగా కాంగ్రెస్కు రూరల్ ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ ఇక్కడే ఎక్స్అఫిషియోగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. అవసరమైన ఓ రాజ్యసభ ఎంపీని దించే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు సమాచారం.
నిజామాబాద్ కార్పొరేషన్లో పుంజుకున్న కాంగ్రెస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



