ఏఐ హబ్ కార్పస్ ఫండ్ కోసం బోర్డు ఏర్పాటు : అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ఐకానిక్గా టీ స్వ్కేర్ నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏఐ హబ్, టీ స్వ్కేర్ ప్రాజెక్టులపై శనివారం హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ సెంటర్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ, టీజీఐఐసీ సంయుక్తంగా ఈ రెండు ప్రాజెక్టులు చేపడుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయదుర్గం సమీపంలో చేపట్టనున్న టీస్వ్కేర్ నిర్మాణ పనులను నవంబర్ చివరి వరకు ప్రారంభించాలని దిశానిర్దేశం చేశారు. టీ హబ్ నిర్మాణం కోసం జైకా ఫండ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాణ్యత, నైపుణ్యం విషయంలో రాజీ పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
పార్కింగ్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. వి హబ్లో ఆపిల్ లాంటి అంతర్జాతీయ బ్రాండ్లు తమ ఔట్లెట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వి హబ్ 24 గంటల పాటు పని చేయాలనీ, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఏఐ హబ్ తాత్కాలిక ఏర్పాటు కోసం ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ లో భవనాలను పరిశీలించాలని సూచించారు. ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలనీ, ఇందుకోసం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సంస్థల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీలు జయేశ్రంజన్, సంజయ్ కుమార్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, టీజీఐఐసీ ఎండీ శశాంక, టీఫైబర్ ఎండీ వేణుప్రసాద్, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రెటరీ భవేశ్ మిశ్రా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.