– సమీక్షా సమావేశంలో మంత్రి తుమ్మల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నాబార్డ్, ఆర్ఐడీఎఫ్ నిధులతో గోదాములు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణాన్ని చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో మార్కెటింగ్, ఆయిల్ఫెడ్, వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం ఉనికిలో ఉన్న గోదాములు, కోల్డ్ స్టోరేజీల సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు మాత్రమే తమ ఉత్పత్తులను అమ్ముకునేలా రైతుబజార్లను తీర్చిదిద్దాలని కోరారు. అందుకోసం అన్ని మార్కెట్లు, రైతు బజార్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మార్కెట్లలో డిజిటల్ బోర్డుల ఏర్పాటుపై చేయాలన్నారు. రైతులకు సరిపడిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని సూచించారు. మే నెలాఖరు వరకు 2 లక్షల మట్టి నమూనాల సేకరించడం పూర్తి చేయాలని కోరారు. వాటి ఫలితాలను రెండు నెలలలోపు రైతులకు అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జొన్నల సేకరణలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా, సహకార అడిషనల్ రిజిస్ట్రార్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
యూరియా సరఫరా చేయండి :కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు మంత్రి తుమ్మల లేఖ
ఏప్రిల్, మే రెండు నెలలకు రాష్ట్రానికి కేటాయించిన యూరియాను పూర్తి స్థాయిలో ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల మంత్రి జేపీ నడ్డాను కోరారు. ఈమేరకు మంగళవారం ఆయనకు తుమ్మల లేఖ రాశారు. ఈ వానాకాలానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిందని తెలిపారు. దానిలో భాగంగా ఏప్రిల్ నెలకు 1.70 లక్షల మెట్రిక్ టన్నులు, మే మాసానికి 1.60 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించారనీ, వాటిని పూర్తి స్థాయిలో విడుదల చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
గోదాములు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణం చేపట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES